రెబెల్స్ కు ఉద్ధవ్ థాక్రే బంపర్ ఆఫర్-మీరు కోరుకుంటే సంకీర్ణానికి గుడ్ బై-బీజేపీపై మద్దతుపై మౌనం
మహారాష్ట్ర శివసేనలో ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో మొదలైన సంక్షోభం గంటగంటకో మలుపు తిరుగుతోంది. ఇరువర్గాలు వరుస ప్రకటనలతో రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే శిబిరంలోకి మెజారిటీ ఎమ్మెల్యేలు జారుకున్న నేపథ్యంలో సీఎం పదవి వదులుకోవాల్సిన పరిస్ధితుల్లో ఉన్న ఉద్ధవ్ థాక్రే.. చివరి అస్త్రం ప్రయోగించారు. రెబెల్ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో షిండే వర్గం అంతర్మథనంలో పడింది.
ఉద్ధవ్ ఆఖరి అస్త్రం
మహారాష్ట్రలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు అపసోపాలు పడుుతున్న సీఎం ఉద్ధవ్ థాక్రే.. షిండే వర్గం ఆఫర్లపై స్పందించారు. ఉద్ధవ్ థాక్రే ను సీఎం పదవి నుంచి తప్పించడం ముఖ్యం కాదని శివసేన మహావికాస్ అఘాడీ కూటమి నుంచి బయటికి రావడమే ముఖ్యమంటూ షిండే వర్గం తాజాగా చేసిన ప్రకటనతో సీఎం స్పందించారు. ప్రభుత్వం కంటే పార్టీనే ముఖ్యమని భావిస్తూ రెబెల్స్ పై చివరి అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ మేరకు పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ తో ప్రకటన చేయించారు.
రెబెల్స్ కు ఉద్ధవ్ ఆఫర్
తనతో విభేదిస్తూ శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఏకే నాథ్ షిండే శిబిరానికి చేరుకున్న నేపథ్యంలో వారికి ఉద్ధవ్ థాక్రే ఓ ఆఫర్ ఇచ్చారు. పార్టీలో ఎమ్మెల్యేలంతా కోరుకుంటే మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు. ఈ మేరకు తాజాగా మాట్లాడిన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. ఎమ్మెల్యేలు గౌహతిలో ఉండి ప్రకటనలు చేయడం కాదు, సీఎం వద్దకు వచ్చి మాట్లాడాలి, వారంతా కోరుకుంటే సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఉద్ధవ్ బౌన్సర్ తో ఆత్మరక్షణలో షిండే
షిండేతో పాటు వెళ్లిన ఎమ్మెల్యేలంతా తిరిగి వచ్చి సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్ బై చెప్పాలని కోరితే తాము ప్రభుత్వం నుంచి బయిటికి వస్తామని ఉద్ధవ్ థాక్రే ఆఫర్ ఇవ్వడంతో రెబెల్స్ ఆత్మరక్షణలో పడ్డారు. ఇప్పటివరకూ థాక్రేతో తమకు ఇబ్బంది లేదని, మహావికాస్ అఘాడీ ప్రభుత్వం నుంచి శివసేన బయటికి రావాలన్నది తమ డీమాండ్ అని చెప్పుకుంటున్న వీరంతా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అయితే శివసేన బయటికి వచ్చినా బీజేపీకి మద్దతిస్తుందా లేదా అన్న దానిపై తదుపరి సమీకరణాలు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.