స్వశక్తి మీద ఆధారపడాలన్న మోడీ డైలాగ్ పై మీమ్స్... ఇప్పుడు లేమా అని శివసేన ప్రశ్న...
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ ఆర్ధిక వ్యవస్ధను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల బారీ ప్యాకేజీ సాధారణ ప్రజలకు, వలస కార్మికులకు ఏ విధంగానూ మేలు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదే తరుణంలో ప్రధాని ప్యాకేజీ ప్రకటన సందర్భంగా చెప్పిన స్వశక్తి మీద ఆధారపడటం ( self reliant) నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వేళ సామాన్యుడికి భరోసా కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు, విద్యుత్ సంస్ధలకు రాయితీ ప్రకటనలతో మోసం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీపై ఒకప్పటి బీజేపీ మిత్రపక్షం శివసేన తాజాగా తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా మోడీ ప్రవచించిన స్వశక్తి మీద ఆధారపడాలనే నినాదంపైనా శివసేన తన పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది. భారత్ స్వశక్తి మీద ఆధారపడటమేంటి ? ఇప్పుడు మనం స్వశక్తిపై ఆధారపడి లేమా అని శివసేన ప్రశ్నించింది.

స్వాతంత్రానికి పూర్వం మన దేశానికి గండుసూది తయారు చేసే సామర్ధ్యం కూడా లేదని, కానీ 60 ఏళ్లలో శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయ, వ్యాపార, రక్షణ, తయారీ, అణుశక్తి రంగాల్లో స్వశక్తిపైనే ఆధారపడేలా ఎదిగిందని సామ్నా గుర్తుచేసింది. వ్యాపారులు పెట్టుబడులు పెట్టాలంటే పర్యావరణ అనుకూలంగా దేశాన్ని మార్చాలని శివసేన కేంద్రానికి సూచించింది.
లాక్ డౌన్ 4 కు వెళుతున్నా, ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించినా స్టాక్ మార్కెట్లు ఎందుకు కోలుకోవడం లేదని సామ్నా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవానికి పునాదులు వేయకపోతే ఇప్పుడు మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లు మాట్లాడే వీలు కూడా ఉండేది కాదని శివసేన చురకలు అంటించింది.












Click it and Unblock the Notifications