మాయావతికి షాక్; పంజాబ్ లో జీరో; యూపీ,ఉత్తరాఖండ్ లోనూ ప్రమాదంలో బీఎస్పీ ఉనికి
ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన మాయావతి పార్టీ బీఎస్పీ, ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలలో ఉనికిని కోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. యూపీలోనే కాదు పోటీ చేసిన మిగతా రాష్ట్రాలలోనూ ఖాతా తెరవలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని శాసించిన మాయావతి ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల నుంచి కనుమరుగయ్యే పరిస్థితి చోటు చేసుకుంది. అందరిలా కాదు మేము ప్రత్యేకమని చెప్పుకొని బీఎస్పీ ఆదరించాలని విజ్ఞప్తి చేసిన మాయావతి ఏనుగుకు యూపీలో కదల్లేని పరిస్థితి వచ్చింది.
యూపీలో మాయావతికి షాక్ ..
గతంలో దళిత, బ్రాహ్మణ ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చిన మాయావతి ఈసారి యూపీ ఎన్నికల లో ఎటువంటి ప్రభావాన్ని చూపించలేకపోయారు. కాన్షీరాం వారసురాలిగా పార్టీ పగ్గాలు చేపట్టిన మాయావతి ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చి కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కానీ గత పార్లమెంటు ఎన్నికల్లో మాయావతి సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని నష్టపోయారు. ఇప్పుడు ఆ తప్పును దిద్దుకుని ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగినా కనీసం తన పార్టీకి సంప్రదాయంగా వస్తున్న ఓటు బ్యాంకును కూడా మాయావతి రాబట్టు లేకపోయారు.
కాంగ్రెస్ తరహాలో సింగిల్ డిజిట్ కే పరిమితం .. 5 స్థానాలలోనే బీఎస్పీ లీడ్
ఈ ఎన్నికల్లో మొదటి నుంచి మాయావతి పార్టీ అంత ఉత్సాహంగా కనిపించలేదు. కాంగ్రెస్ తరహాలోనే పేలవమైన ప్రదర్శన చూపించి మాయావతి యూపీలో దారుణంగా దెబ్బతిన్నారు. 403 స్థానాలలో ఒంటరిగా పోటీ చేసిన మాయావతి ప్రచారాన్ని కూడా సరిగా నిర్వహించలేక పోయారు అన్న విమర్శలు ఇప్పటికే వినిపించాయి. ఇక ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ బేస్ గా ఏర్పడిన మాయావతి బిఎస్పి యూపీలోని నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. కేవలం 5 స్థానాలలోనే మాయావతి పార్టీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. సింగిల్ డిజిట్ కే మాయావతి పార్టీ పరిమితం కావడం బి ఎస్పి కి షాక్ అనే చెప్పాలి.
పంజాబ్, ఉత్తరాఖండ్ లోనూ తుడిచిపెట్టుకుపోయిన మాయావతి పార్టీ
అంతేకాదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా పంజాబ్ మరియు ఉత్తరాఖండ్ అంతటా బహుజన్ సమాజ్ పార్టీ (BSP) తుడిచిపెట్టుకుపోయింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఉత్తరప్రదేశ్లో బీఎస్పీకి పూర్తి మెజారిటీ వస్తుందని గతంలో చెప్పిన పార్టీ అధినేత్రి మాయావతి, యూపీలో కేవలం 5, పంజాబ్లో 0, ఉత్తరాఖండ్లో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
దారుణంగా ఐదు స్థానాలలోనే బీఎస్పీ లీడ్
పశ్చిమ మరియు తూర్పు ప్రాంతాలలో బలమైన స్థావరాన్ని కలిగి ఉన్న యుపిలో పార్టీ పనితీరు కారణంగా ఈ ఎన్నికల్లో బీఎస్పీ దారుణంగా దెబ్బతింది. యూపీలో బీఎస్పీ 2007లో రాష్ట్రంలో 403 స్థానాలకు గానూ 206 సీట్లు గెలుచుకుని ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆ తర్వాత 2012లో 80 సీట్లు, 2017లో 19 సీట్లు, ఇప్పుడు 2022లో మరీ దారుణంగా ఐదు స్థానాలకే పరిమితం కావడం పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది.
Recommended Video
పంజాబ్ లో జీరో .. ఉత్తరాఖండ్ లో రెండు చోట్ల తంటాలు
ఇక పంజాబ్లో, పార్టీ ఎప్పుడూ ప్రభావం చూపించలేదు. పంజాబ్లో మాయావతి పార్టీ నాన్ స్టారర్ గానే ఉంది. 1997 నుండి రాష్ట్ర శాసనసభలో ఒక్క సీటు కూడా గెలవలేదు. 2017 ఎన్నికల్లో 1.52 శాతం ఓట్ షేర్ వచ్చింది. అయితే, ఈసారి శిరోమణి అకాలీదళ్తో పొత్తు మెరుగైన ఫలితాలు వస్తాయన్న అంచనా కు కారణమైంది. అయినప్పటికీ బిఎస్పికి ఇప్పటి వరకు 1.92 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. ఉత్తరాఖండ్లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 6.99 శాతం ఓట్లు రాగా, ప్రస్తుతం అది 4.78 శాతానికి తగ్గింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ శాసనసభలో సున్నా సీట్లు ఉన్నందున, బీఎస్పీ తన ఖాతాను తెరుస్తుందా లేదా తెలియాల్సి ఉంది.