షాకింగ్: ప్రధాని మోదీకి పవార్ ఫిర్యాదు - అతను గవర్నరా? - సీఎంపై ఆ మాటలేంటి?
40వేల పైచిలుకు కరోనా మరణాలు నమోదైన మహారాష్ట్రలో రాజకీయాలు వైరస్ కంటే ప్రమాదకరంగా మారాయి. కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదని, ప్రజలు అజాగ్రత్త వహించొద్దని ప్రధాని నరేంద్ర మోదీ హితవు పలికినా మహా బీజేపీ నేతలు తమదైన శైలిలో ఆలయాలు తెరవాలంటూ ఉద్యమాన్ని లేవనెత్తడం, దానికి గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఊతమివ్వడం, ముఖ్యమంత్రిని ఉద్దేశించి గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ప్రకంపనలు రేపుతున్నది. ఈ వ్యవహారంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మంగళవారం ప్రధాని మోదీకి ఫిర్యాదు లేఖ రాశారు.

షాకింగ్ కామెంట్స్..
మహారాష్ట్రలో ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలను తిరిగి తెరవాలంటూ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ తాజాగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు రాసిన లేఖలో అతి తీవ్ర పదజాలం వాడటం వివాదాస్పదమైంది. గొప్ప హిందువునని చెప్పుకునే ఉద్ధవ్.. సడెన్ గా సెక్యూలర్ అయ్యాడా? రాత్రికి రాత్రే ఏదైనా దివ్య సందేశం వినిపించిందా? కొవిడ్ నిబంధనల ప్రకారం ఆలయాలు తెరవడానికి ఇబ్బందేంటి? అంటూ గవర్నర్ లేఖలో ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు అత్యంత షాకింగ్ గా ఉననాయని శరద్ పవార్ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఆయన గవర్నరా? పార్టీ అధ్యక్షుడా?
‘‘ప్రార్థనా స్థలాలను మళ్లీ తెరవాలన్న గవర్నర్ ఇంటెన్షన్ మంచిదే. ఒక పౌరుడిగా తన భావాలను వ్యక్తం చేసే హక్కు కాదనలేదనిదే. కానీ, ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన వాడిన పదాలు, వ్యక్తీకరించిన భావాలు అత్యంత షాకింగ్ గా ఉన్నాయి. అన్ని మతాలను సమానంగా చూడాలనే రాజ్యాంగ భావనే సెక్యూలర్. రాజ్యాంగంపై ప్రమాణం చేశారు కాబట్టి సీఎం ఉద్ధవ్ విధిగా సెక్యూలరిజాన్ని అనుసరించాల్సిందే. అసలు లేఖలో సీఎం మత విశ్వాసాలను ప్రస్తావించాలసిన అవసరం ఏమొచ్చింది? ఆయన గవర్నర్ లా కాకుండా ఓ పార్టీకి అధ్యక్షుడి స్థాయిలో లేఖ రాశారు'' అని శరద్ పవార్.. ప్రధాని మోదీకి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.

సీఎం ఘాటు కౌంటర్ సరైందే..
వ్యక్తిగత విశ్వాసాలను ఎద్దేవా చేస్తున్నట్లుగా లేఖ రాసిన గవర్నర్ కు ముఖ్యమంత్రి ఉద్ధవ్ అదే స్థాయిలో బదులు చెప్పడాన్ని ఎన్సీపీ సమర్థిస్తున్నదని శరద్ పవార్ స్పష్టం చేశారు. గవర్నర్ కోశ్యారీ కూడా సెక్యూలర్ రాజ్యాంగంపైనే ప్రమాణం చేశారనే విషయం మర్చిపోరాదని, దివ్యస్వరాలు గవర్నర్ కే వినబడతాయని, కరోనా పరిస్థితులకు అనుగుణంగానే ఆలయాల పున: ప్రారంభంపై నిర్ణయాలు తీసుకుంటామని సీఎం ఉద్ధవ్ తెలిపారు. గతంలో తెల్లవారకముందే ఫడ్నవిస్ తో సీఎంగా ప్రమాణం చేయించిన గవర్నర్ కోశ్యారీ.. ఉద్ధవ్ సీఎం అయిన తర్వాత పలు సందర్భాల్లో సర్కారుపై నేరుగా విమర్శలు చేయడం తెలిసిందే.












Click it and Unblock the Notifications