షాకింగ్: మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక.. విద్యార్థులకు అస్వస్థత
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. బడి పిల్లలకు షోషకాలతో కూడిన ఆహారం అందించాల్సిన అధికారులు అలసత్వం ప్రదర్శించారు. బడి పిల్లలకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక దర్శనమిచ్చింది. సోన్ భద్రలో ఒక లీటరు పాలల్లో 20 లీటర్ల నీటిని కలుపుతూ 80 మంది విద్యార్థులకు ఇచ్చిన ఘటన మరువక ముందే... మిడ్ డే మీల్స్లో ఎలుక ప్రత్యక్షం అవడం అధికారుల నిర్లక్ష్యాన్ని మరో సారి బయటపెట్టింది.

మిడ్ డే మీల్స్లో చచ్చిన ఎలుక
ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో విద్యార్థులకు అందించే మిడ్డే మీల్స్లో చనిపోయిన ఎలుక ప్రత్యక్ష మైంది. అదే ఆహారంను పిల్లలకు వడ్డించడంతో 9 మంది విద్యార్థులు అనారోగ్యంకు గురయ్యారు. ముజఫర్నగర్లోని జనతా ఇంటర్ కాలేజ్లోని విద్యార్థులకు ఈ ఆహారం వడ్డించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ముజఫర్ నగర్లోని విద్యార్థులకు చచ్చిన ఎలుక పడిన ఆహారంను వడ్డించడం జరిగిందని అధికారులు చెబుతున్నారు.
అప్పటికే ఆహారం తినేసిన విద్యార్థులు
ఇక ఎలుకను కనుగొనేలోపల అప్పటికే విద్యార్థులు ఆహారంను తినేశారని టీచర్లు చెప్పారు. ఇక ఆహారం తీసుకున్న విద్యార్థులు వాంతులు అయ్యాయని టీచర్లు తెలిపారు. వెంటనే వారిని జిల్లా హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు చెప్పారు. అయితే ఎలుక పడ్డ ఆహారం తినడంతోనే విద్యార్థులకు వాంతులు అయ్యాయని వైద్యులు చెప్పారు.

విచారణకు ఆదేశించిన కలెక్టర్
ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విద్యార్థులకు మిడ్ డే మీల్స్ తయారు చేసే ఏజెన్సీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. ఇక ఘటన వెలుగు చూడగానే సంబంధిత అధికారులు కాలేజీకి పరుగులు తీసి శాంపిల్స్ సేకరించారు. ఘటనపై విచారణ చేస్తున్నారు. మిడ్ డే మీల్స్ను దగ్గరగా పర్యవేక్షించకుంటే ఇలాంటి ఘటనలు చాలా పునరావృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. సోనభద్రలో ఒక లీటరు పాలల్లో 20 లీటర్ల నీళ్లు కలుపుతూ పట్టుబడిన విషయం వెలుగు చూసిన కొద్ది రోజుల్లోనే మరో ఘటన బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.

యూపీ స్కూళ్లల్లో ఇలాంటి సర్వసాధరణం
ఈ ఏడాది మొదట్లో ఓ స్కూలులోని విద్యార్థులకు మిడ్ డే మీల్స్ పేరుతో ఒక రొట్టెతో పాటు అందులోకి ఉప్పును వడ్డించిన ఘటన వెలుగు చూసింది. అంతేకాదు సీతంపూర్ జిల్లాలో అక్టోబర్లో ఇదే తరహా ఘటన బయటపడింది. విచిపరియా గ్రామంలో విద్యార్థులకు పులిసిపోయి చెడిపోయిన పులిహోరా వడ్డించారు. ఇలాంటి పలు ఘటనలు వెలుగులోకి వచ్చినప్పటికీ ఇటు ప్రభుత్వం కానీ అటు విద్యాశాఖ అధికారులు కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిల్లలకు కుళ్లిపోయిన ఆహారం వడ్డించి వారి ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి ఏజెన్సీలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications