షాకింగ్ : 500 మంది వైద్యులకు, వైద్య సిబ్బందికి కరోనా .. బీహార్ లో రెండు ఆస్పత్రుల్లోనే !!
బీహార్ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. బీహార్ రాష్ట్రంలో కరోనా బాధితులకు సేవలందిస్తున్న 500 మందికి పైగా వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడటం ఒక్కసారిగా రాష్ట్రాన్ని షాక్ కు గురి చేసింది. కరోనా మహమ్మారి వైద్యులను సైతం వదలని పరిస్థితి వైద్యరంగాన్ని ఆందోళనలో పడేస్తుంది.

ఎయిమ్స్, పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ లో 500 వైద్యులకు కరోనా
బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలోని రెండు ప్రముఖ ఆసుపత్రులైన ఎయిమ్స్ , పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పిఎంసిహెచ్) లో కరోనా బాధితులకు సేవలందిస్తున్న 500 మందికి పైగా వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తలు కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి బారిన పడ్డారని వైద్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
మొత్తంగా, ఎయిమ్స్ పాట్నాలోని 384 మంది ఉద్యోగులు, వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులతో సహా, ఇప్పటివరకు కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి బారిన పడ్డారని దాని మెడికల్ సూపరింటెండెంట్ సి.ఎం. సింగ్ అన్నారు.

పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో 125 మందికి పైగా పాజిటివ్
పిఎంసిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఇందు శేఖర్ ఠాకూర్ మాట్లాడుతూ ఇప్పటివరకు 125 మందికి పైగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది అన్నారు. ఈ జాబితాలో 70 మంది వైద్యులు, 55 మందికి పైగా నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.
పిఎంసిహెచ్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఆసుపత్రి అధికారులు కరోనా సోకిన వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారని వెల్లడించారు.

వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ , ఆసుపత్రులలో సిబ్బంది కొరత
బీహార్లోని శతాబ్దాల నాటి ప్రీమియర్ హాస్పిటల్ అయిన పిఎంసిహెచ్, కోవిడ్ రోగులకు సుమారు 105 పడకల సౌకర్యాన్ని కలిగి ఉంది. ఎయిమ్స్ పాట్నా తన పడక సామర్థ్యాన్ని 250కి విస్తరించింది . ఈ ఆసుపత్రిలో దాదాపు బెడ్ లు అన్నీ ఫుల్ అయ్యాయి. వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకడంతో ఆసుపత్రులలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోందని రెండు ఆసుపత్రుల ఉన్నతాధికారులు చెబుతున్నారు.

బీహార్ రాష్ట్రంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ పంజా
ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది సెలవు రద్దు చేసి, కరోనా బాధితులకు సేవలు అందిస్తున్నామని తెలిపారు . ఎయిమ్స్ మరియు పిఎంసిహెచ్ తో పాటు మరో ప్రభుత్వ వైద్య సంస్థ నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రాష్ట్ర రాజధానిలో పెద్ద సంఖ్యలో కోవిడ్ రోగులకు సేవలు అందిస్తోంది.
దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా బీహార్ రాష్ట్రంలో కూడా కరోనావైరస్ సెకండ్ వేవ్ పెరుగుదలను చూస్తోంది. బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం, మొత్తం 12,222 మంది పాజిటివ్ పరీక్షలు చేయగా, 56 మంది ప్రాణాంతక వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం 3,54,281 కోవిడ్ కేసులు ఉండగా, మరణించిన వారి సంఖ్య 1,897 గా ఉంది, బీహార్లో ప్రస్తుతం 63,745 క్రియాశీలక కరోనావైరస్ కేసులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications