షాకింగ్: జమ్మూ కాశ్మీర్ జైళ్ళశాఖ డీజీపీ దారుణహత్య; గొంతుకోసి, తగలబెట్టే యత్నం చేసిన నిందితుడు!!
జమ్ము కాశ్మీర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జమ్ము కాశ్మీర్ జైళ్లశాఖ డిజిపి హేమంత్ కుమార్ లోహియా దారుణ హత్యకు గురయ్యారు. ఆయన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురైనట్టుగా పోలీసులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డిజిపి హేమంత్ కుమార్ లోహియా హత్యపై దర్యాప్తు ప్రారంభించారు. ఆయన ఇంట్లో పని చేసే వ్యక్తి పై అనుమానాలు వ్యక్తం కావడంతోపాటు, అతను కనిపించకపోవడంతో, పని చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ జైళ్ళ శాఖ డీజీపీ దారుణ హత్య
జమ్మూ కాశ్మీర్ జైళ్ళ శాఖ డీజీపీ హేమంత్ కుమార్ లోహియా ను గొంతుకోసి హతమార్చిన దుండగులు, ఆయన శరీరాన్ని తగలబెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు సంఘటన స్థలంలో ఉన్న పరిస్థితిని బట్టి పోలీసులు గుర్తించారు. నిందితుడు మొదట హేమంత్ కుమార్ లోహియాకు ఊపిరాడకుండా చేసి హతమార్చి, ఆపై వంటగది నుండి పగిలిన సీసాతో గొంతు కోసినట్లు తెలుస్తుందని డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. ఆపై ఆయన మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా జమ్ము కాశ్మీర్ డిజిపి దిల్ బాగ్ సింగ్ పేర్కొన్నారు.
హత్యలో నిందితుడు ఇంట్లో పనివాడేనని అనుమానం
హేమంత్ కుమార్ లోహియా హత్యకేసులో పోలీసులు అనుమానిస్తున్న ఇంట్లోని పనివాడు యాసిర్ గా గుర్తించారు. అతడు జమ్మూ కాశ్మీర్ లోని రాంబాన్ జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పరారీలో వున్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మూలోని తన ఇంటి పునరుద్ధరణ పనుల నేపథ్యంలో తన స్నేహితుడైన రాజీవ్ ఖజూరియా ఇంట్లో హేమంత్ కుమార్ లోహియా తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలోని లోహియా ను అత్యంత దారుణంగా హతమార్చారు.
లోహియా హత్యకేసులో అనేక అనుమానాలు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
57 సంవత్సరాల హేమంత్ కుమార్ లోహియా 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన తన ఉడాయివాలా నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. అయితే లోహియా హత్యకేసులో అనేక అనుమానాలున్నాయి. నిందితుడు లోహియాను ఎందుకు హతమార్చారు? అతని వెనుక మరెవరైనా ఉన్నారా? నిందితుడికి లోహియా కు మధ్య మరేమైనా వివాదాలు ఉన్నాయా ? వంటి కోణాలలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.