'ఆ భయంతోనే బీజేపీకి ఓటేశారు'
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికార ఎన్డీయే కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఎన్డీయే కూటమి 202 సీట్లు సాధించి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఇక ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ కూటమి మరోసారి చతికిలబడింది. ఈ ఎన్నికల్లో 35 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్థాపించిన జన్ సూరజ్ పార్టీ.. దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసినా కనీసం ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది.
అయితే తాజాగా ఫలితాలపై జన్ సూరజ్ పార్టీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓటమిపై స్పందించారు. స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్(SIR) లో భాగంగా అత్యధిక ఓట్లను తొలగించారని ఇండియా కూటమి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. 'జంగిల్ రాజ్' భయంతోనే ఓటర్లంతా ఎన్డీయే కూటమి వైపునకు మళ్లారని స్పష్టం చేశారు. ఆర్జేడీకు ఓటేస్తే మళ్లీ ఆనాటి జంగిల్ రాజ్ పాలన తీసుకొస్తారన్న భయంతోనే ఓటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారని ఉదయ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
ప్రజలు ఎవరైతే జన్ సూరజ్ పార్టీని ఎంచుకోవాలని అనుకున్నారో.. మెల్లగా వాళ్లంతా ఎన్డీయే వైపునకు షిఫ్ట్ అయ్యారని తెలిపారు.' ఆర్జేడీకు ఓటేస్తే జంగిల్ రాజ్ ప్రభుత్వం వస్తుందన్న భయంతో.. మాకు ఛాన్స్ ఇవ్వాలని అనుకున్నారు. కానీ చివరికి భయంతో ఎన్డీయే వైపునకే మొగ్గుచూపారు. ప్రజలకు ఆర్జేడీతోనే సమస్య ఉంది. కాంగ్రెస్ తో గానీ మహాగఠ్ బంధన్ కూటమితో గానీ సమస్య లేదు" అని ఉదయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. నవంబర్ 11 న దిల్లీ పేలుడు ఘటన సీమాంచల్ అసెంబ్లీ పోలింగ్ ముందురోజు జరిగిందని.. తాను ఆ సమయంలో సీమాంచల్ లోనే ఉన్నానని తెలిపారు. ఆ సంఘటనతో ఓట్ల పోలరైజేషన్ జరిగిందని తెలిపారు.

ఈ ఎన్నికల్లో మైనారిటీ వర్గాల నుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదని ఉదయ్ సింగ్ స్పష్టం చేశారు. కానీ భవిష్యత్తులో వాళ్లు తమ పార్టీని ఆదరిస్తారని కోరుకుంటున్నట్లు తెలిపారు. తమకు ఈ ఎన్నికల్లో సింగిల్ సీటు కూడా రాకపోయినా.. ఎన్డీయేను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఇక జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్.. నవంబర్ 16 న మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తదుపరి కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications