వామ్మో.. ఈ పాముది మామూలు పగ కాదు భయ్యా..!
భారత్ లో పాములను పూజించేవాళ్లు ఉన్నారు. అలాగే పాము కనిపిస్తే చంపేవాళ్లు కూడా ఉన్నారు. పాము గుడి లాంటి ప్రదేశాల్లో కనిపిస్తే దైవంగా భావిస్తాం. అదే పొలంలోగానీ ఇతర ప్రాంతాల్లో కనిపిస్తే భయపడి చంపేస్తుంటాం. మనుషులకు ఉన్నట్టే పాములకు కూడా పగ, ప్రతీకారాలు లాంటివి ఉంటాయా..? ఈ ఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది. అయితే ఆ పాము పగబట్టిందో లేదా యాదృచ్ఛికంగా జరుగుతుందో తెలియదు కానీ పదిహేనేళ్ల బాలికను నెలలో ఏకంగా ఆరుసార్లు కాటేసింది ఓ పాము. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కౌశాంబి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాములు పగబడతాయా.. అంటే అవునని కొందరు.. అలాంటివి ఏమీ లేవని మరికొందరు చెబుతుంటారు. అయితే తాజాగా ఉత్తర్ ప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భైంషాపర్ గ్రామానికి చెందిన 15 ఏళ్ల రియా మౌర్య అనే బాలికను ఓ పాము ఏకంగా ఆరుసార్లు కాటు వేసింది. ఈ విషయాన్ని రియా తండ్రి రాజేంద్ర తెలిపారు.
2025 జూలై 22న పొలానికి వెళ్తుండగా.. తన కుమార్తెను మొదటిసారి పాము కరిచిందని రియా తండ్రి రాజేంద్ర తెలిపారు. పాము కరిచిన వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించామన్నారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే ఆమె కోలుకొని కొన్ని నెలలు కూడా కాక ముందే ఆగస్ట్ 13న మరోసారి తన కూతురిని పాము కరిచినట్టు ఆయన చెప్పారు. అప్పుడు పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు రియాను ప్రయాగ్ రాజ్ లోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. కానీ తాము స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ లో రియాకు చికిత్స చేపించినట్లు పేర్కొన్నారు.
అయితే ఆగస్టు 27 నుండి ఆగస్టు 30వ తేదీ మధ్యలో మరో నాలుగు సార్లు రియాపై పాము దాడి చేసినట్టు రియా తండ్రి పేర్కొన్నారు. రియా స్నానం చేస్తున్నప్పుడు, ఇంటి పనులు చేస్తున్నప్పుడు ఇలా మొత్తం నాలుగు సార్లు రియాను పాము కాటు వేసినట్టు చెప్పుకొచ్చాడు. కూతురి వైద్య ఖర్చులకు తాము పొదుపు చేసిన డబ్బు మొత్తం సరిపోయిందని ఆయన వాపోయారు. అయితే పదేపదే ఇలా జరగడంతో అనుమానం వచ్చిన అతను భూతవైద్యుడిని కూడా ఆశ్రయించినట్టు పేర్కొన్నాడు.

ఇక ఇదే ఘటనపై బాధితురాలు రియా మాట్లాడుతూ.. తనను కరిచిన పాము చాలా పెద్దగా, ముదురు నలుపు రంగులో ఉన్నట్టు తెలిపింది. రియా విషయం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా వారి నుంచి ఎలాంటి స్పందన లేదని వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు, బాధితులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications