బాలాకోట్ ఉగ్రవాదుల మృతదేహాలను మాకు చూపండి: అప్పుడే మాకు మన:శాంతి
లక్నో: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖకు అవతల పాకిస్తాన్ భూభాగంపై ఉన్న బాలాకోట్ పట్టణ సమీపంలోని పర్వత ప్రాంతాల్లో జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిక్షణా శిబిరంపై భారత వైమానిక దళం దాడులపై కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దాడులు చేయడం నిజమే అయినప్పటికీ.. 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారనడానికి సరైన సాక్ష్యాధారాలు చూపాలని, దీనికి సంబంధించిన ఉపగ్రహ ఫొటోలను బహిర్గతం చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.
ఉగ్రవాదుల మృతదేహాలను చూసిన తరువాతే..
పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జైషె మహమ్మద్ ఉగ్రవాదులు చేసిన దాడిలో అమరువీరులైన సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలు కూడా ఇవే డిమాండ్ ను అందిపుచ్చుకున్నాయి. ఉగ్రవాదుల మృతదేహాలను తమకు చూపించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. తమ ఆప్తులను పొట్టన పెట్టుకున్న జైషె మహమ్మద్ ఉగ్రవాదుల మృతదేహాలను కళ్లారా చూసిన తరువాతే తమ మనసుకు శాంతి కలగుతుందని, తమ కడుపుకోత చల్లారుతుందని సీఆర్పీఎఫ్ అమర జవాన్ల కుటుంబీకులు కేంద్రాన్ని కోరుతున్నారు.
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద కిందటి నెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై జైషె మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేసి, మారణహోమాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 42 మంది జవాన్లు అమరులయ్యారు. వారిలో ఇద్దరు ఉత్తర్ ప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా షామ్లీ ప్రాంతానికి చెందిన ప్రదీప్ కుమార్, మణిపూర్ కు చెందిన రామ్ వకీల్ కూడా ఉన్నారు.
ప్రదీప్ కుమార్, రామ్ వకీల్ కుటుంబీకులు తాజాగా చేసిన వినతి.. కేంద్రప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది. బాలాకోట్ పై భారత వైమానిక దళం చేసిన దాడుల్లో హతమైన జైషె మహమ్మద్ ఉగ్రవాదుల మృతదేహాలను వెంటనే తమకు చూపించాలని కోరాయి. అప్పుడే తమ కడుపుకోత చల్లారుతుందని స్పష్టం చేశాయి. బాలాకోట్ వైమానిక దాడుల్లో 300 నుంచి 350 మంది ఉగ్రవాదులు హతమయ్యారంటూ కేంద్రం చేసిన ప్రకటనను దృష్టిలో పెట్టుకుని తాము ఈ మేరకు కేంద్రాన్ని కోరుతున్నామని మణిపూర్ కు చెందిన రామ్ వకీల్ సోదరి రామ్ రక్ష అన్నారు.
ఛిద్రమైన జైషె ఉగ్రవాదులను చూపాల్సిందే..
పుల్వామా ఉగ్రవాదుల దాడిలో తన సోదరుడు కన్నుమూశాడని, ఆ దిగ్భ్రాంతి నుంచి తాము ఇప్పటికీ కోలుకోలేకపోతున్నామని రామ్ రక్ష చెబుతున్నారు. తమలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయని అన్నారు. పుల్వామా దాడి అనంతరం సీఆర్పీఎఫ్ జవాన్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తాము ప్రత్యక్షంగా చూశామని చెప్పారు. సీఆర్పీఎఫ్ అమర జవాన్లలో ఒకరు చేతులు కోల్పోయి, మరొకరు కాళ్లు కోల్పోయి.. దీనస్థితిలో ఉన్న దృశ్యాలు చూశామని అన్నారు. వైమానిక దాడుల సందర్భంగా కూడా బాలాకోట్ లో కూడా ఉగ్రవాదులు కూడా ఛిద్రమైన శరీరాలతో పడి ఉండి ఉంటారని రామ్ రక్ష అన్నారు. అలాంటి దృశ్యాలు, ఫొటోలను చూసిన తరువాతే తమకు మన:శాంతి లభిస్తుందని, కడుపుకోత చల్లారుతుందని చెప్పారు.
వైమానిక దాడులను విశ్వసిస్తున్నా..
బాలాకోట్ లోని జైషె మహమ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై భారత వైమానిక అధికారులు దాడులు చేసి ఉంటారనే విషయాన్ని తాను పూర్తిగా విశ్వసిస్తున్నానని అన్నారు. వైమానిక దాడులపై తనకు ఎలాంటి సందేహాలు లేవని అన్నారు. దాడుల తరువాత పరిస్థితేమిటని రామ్ రక్ష ప్రశ్నించారు. దాడులకు సంబంధించిన సరైన సాక్ష్యాధారాలను చూపిన తరువాతే నమ్మే వాతావరణాన్ని కేంద్రమే కల్పించినట్టయిందని అన్నారు. బాలాకోట్ లో ఎలాంటి విధ్వంసం చోటు చేసుకోలేదంటూ పాకిస్తాన్ ప్రభుత్వం చేసిన ప్రకటన అబద్ధమని చెప్పడానికైనా.. సాక్ష్యాలను చూపాలని ఆమె కోరారు.
హతమైన ఒక్క ఉగ్రవాదిని కూడా చూపరా?
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అమర జవాను ప్రదీప్ కుమార్ తల్లి, 80 సంవత్సరాల సులేలత కూడా ఇదే మాటను ఉటంకిస్తున్నారు. వైమానిక దాడులతో తాము సంతృప్తి చెందట్లేదని ఆమె తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల మృతదేహాలను తమకు చూపాల్సిందనని డిమాండ్ చేస్తున్నారు. ప్రదీప్ లాగే పుల్వామా దాడిలో ఎందరో కుమారులు అమరవీరులయ్యారని, వారి తల్లులకు కడుపుకోతను మిగిల్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని, కనీసం ఒక్క ఉగ్రవాది మృతదేహాన్నయినా తమకు చూపాలని అన్నారు. ఉగ్రవాదుల మృతదేహాలను టీవీల్లో చూసి తమ కడుపుకోతను చల్లార్చుకుంటామని సులేలత చెప్పారు.