అందరి ముందు మహిళ చున్నీ లాగేశాడు!: మాజీ సీఎం సిద్ధరామయ్య దురుసు (వీడియో)
Recommended Video
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించారు. అందరి ముందు ఓ మహిళ చున్నీని (దుపట్ట)ను లాగారు. ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
చున్నీ లాగేసిన సిద్ధరామయ్య
ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని, తమ సమస్యలు తీర్చడం లేదని ఓ మహిళ.. సిద్ధరామయ్య ముందు ఏకరువు పెట్టారు. మీ కొడుకు నియోజకవర్గంలో ఏ సమస్య తీరడం లేదని ఆమె ఆయన ముందు వాపోయారు. దీంతో సిద్దరామయ్య సహనం కోల్పోయారు. ఆమెను కొట్టినంత పని చేశారు. ఆ తర్వాత ఆమె చున్నీ పట్టి లాగేశారు. ఆయన చర్యతో అక్కడున్న వారు అందరూ ఆశ్చర్యపోయారు. ఎంతోమంది ముందు, మీడియా ప్రతినిధులు ఉండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.
కొడుకు నియోజకవర్గంలోని సమస్యలపై నిలదీయడంతో
ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఈ సంఘటన మైసూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. సిద్ధరామయ్య కొడుకు యతీంద్ర కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. యతీంద్ర నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని, పట్టించుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. తన కొడుకు సమస్యలు పట్టించుకోవడం లేదని అడగడంతో సిద్ధరామయ్య సహనం కోల్పోయారు.
మహిళతో వాగ్వాదం
ఆ సమయంలో ఆమె వేసుకున్న చున్నీని లాగేశారు. అయితే ఆమె చేతిలో ఉన్న మైక్ను లాగబోగా.. చున్నీ కూడా వచ్చిందని చెబుతున్నారు. ఆమె చున్నీ లాగడంతో పాటు ఆమెపై చేయి వేసి బలవంతంగా కూర్చోబెట్టే ప్రయత్నాలు చేశారు. ఆమెతో వాగ్వాదానికి దిగారు. ఇక్కడి నుంచి వెళ్లిపో అన్నట్లుగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళపై చేయి చేసుకున్నంత పని చేశారు.
సిద్ధరామయ్య తీరుపై దుమారం
సిద్ధరామయ్య తీరుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మహిళపై చేయి చేయి చేసుకోవడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఓ మహిళతో ఇలాగేనా ప్రవర్తించేదని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సమస్యలు వచ్చిన మహిళతో దురుసుగా ప్రవర్తించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.