ఎక్కడ చెడింది?: జైట్లీ ఎఫెక్ట్.. సిద్ధూ రాజీనామా వెనుక!
న్యూఢిల్లీ: రెండు నెలల క్రితం రాజ్యసభకు ఎన్నికైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంగా మారింది. ఏఏపీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆయనకు గాలం వేశారని, పంజాబ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి.
సిద్ధూ అసంతృప్తిని కేజ్రీవాల్ క్యాష్ చేసుకున్నారని భావిస్తున్నారు. బీజేపీ పైన సిద్ధూ చాలాకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయం నుంచే ఆయన బీజేపీ అధిష్టానంతో అంత బాగా లేరు.
ఆ ఎన్నికల సమయంలో అమృత్ సర్ నియోజకవర్గం నుంచి అరుణ్ జైట్లీ పోటీ చేసేందుకు అవకాశమివ్వాలని బీజేపీ సిద్ధూకు సూచించింది. అంతకుముందు, పదేళ్లుగా సిద్ధూ అమృత్ సర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు.
అలాంటి అమృత్ సర్ను వదులుకోమని చెప్పడం సిద్ధూను బాధించింది. 2014 ఎన్నికల్లో అమృత్ సర్ నుంచి పోటీ చేసిన అరుణ్ జైట్లీ ఓటమి పాలయ్యారు.
సిద్ధూ టీమిండియా ఓపెనర్గా ఎన్నో రికార్డులు సృష్టించాడు. అనంతరం కామెంటేటర్ అవతారమెత్తాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి, ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించారు. బీజేపీ తరఫున పోటీ చేసి రెండుసార్లు అమృత్ సర్ నుంచి గెలిచారు.
కేజ్రీవాల్ బంపర్ ఆఫర్: మోడీకి సిద్ధూ ఝలక్, రాజ్యసభకు రిజైన్ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఎంపీగా పనులు చేపట్టేందుకు వెళ్లగా అకాలీదల్ నేతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యేది. దీంతో పలు సందర్భాల్లో పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులను బీజేపీ అంతగా పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. అకాలీదల్ నిర్ణయాలకు పలు సందర్భాల్లో మద్దతు పలికింది. పైగా, తన నియోజకవర్గాన్ని జైట్లీకి ఇవ్వమని చెప్పడం మరింత బాధించిందని అంటారు.
ఇలాంటి సమయంలో పంజాబ్లో సంస్కరణలు చేపడతామంటూ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ చేస్తున్న ప్రచారానికి మద్దతు లభిస్తోంది. అదే సమయంలో సిద్ధూ ఆ పార్టీలో చేరితే ఆ పార్టీ అక్కడ మరింత బలపడుతుంది.