చివరి రోజు మనస్సు హత్తుకునే ప్రసంగం చేసిన సుప్రీంకోర్టు జడ్జీ కురియన్ జోసెఫ్
చట్ట విరుద్ధమైన పనులు చేసి హింసకు పాల్పడే మనుషులకంటే చట్టబద్దమైన మనుషులు మౌనం వహించడం సమాజానికి మరింత ప్రమాదకరంగా మారుతుందని అన్నారు సుప్రీంకోర్టు జడ్జి జోసెఫ్ కురియన్. సుప్రీం కోర్టు జడ్జిగా తన చివరి రోజున మనసు హత్తుకునే ప్రసంగం చేశారు జస్టిస్ జోసెఫ్ కురియన్. కోర్టు హాలులో ఒక తీర్పు చెబుతున్నప్పుడు అది చాలా స్పష్టతతో కూడినది అయి ఉండటమే కాకుండా మరో మాటకు తావు లేకుండా ఉండాలని అన్నారు. తన కెరీర్లో ఇలాంటి తీర్పులు ఎన్నో చెప్పానని ఈరోజు ప్రపంచానికి గర్వంగా చెప్పగలనని అన్నారు జస్టిస్ కురియన్.
కేరళ హైకోర్టులో ఒక న్యాయవాదిగా తన జీవితం ప్రారంభమైందని గుర్తుచేసుకున్నారు. 1996లో సీనియర్ అడ్వకేటుగా గుర్తింపు వచ్చిన తర్వాత న్యాయమూర్తిగా 2000 సంవత్సరంలో చేరినట్లు చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఛీఫ్ జస్టిస్గా బాధ్యతలు చేపట్టకముందు తాత్కాలిక ఛీఫ్ జస్టిస్గా రెండు సార్లు పనిచేశారు. ఐదున్నర ఏళ్ల క్రితం సుప్రీం కోర్టు జడ్జిగా ప్రమోషన్ అందుకున్నారు. జస్టిస్ జోసెఫ్ తండ్రి కేరళ హైకోర్టులో క్లర్క్గా పనిచేశారు. క్రమశిక్షణ ఉంటేనే గమ్యాన్ని చేరుకోగలం అనే సిద్దాంతాన్ని తను బలంగా నమ్ముతానని జస్టిస్ కురియన్ చెప్పారు. జస్టిస్ కురియన్కు సేవా భావం కూడా చాలా ఉంది. తన సొంత రాష్ట్రం కేరళను వరదలు ముంచెత్తినప్పుడు అర్థరాత్రి అపరాత్రి అని సమయం చూడకుండా బార్ అసోసియేషన్లో సభ్యుల సహకారంతో వరదబాధితులకు సహాయం చేశారు. ఇలా కేరళ ఒక్క రాష్ట్రమే కాదు, తమిళనాడు, అస్సోం, హిమాచల్ ప్రదేశ్లో సహజ విపత్తులు సంభవించినప్పుడు సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవారు జస్టిస్ కురియన్. బాధపడుతున్న వారిని ఎవరినైనా చూస్తే తన హృదయం స్పందించకుండా ఊరుకోలేదని చెప్పారు. సహాయం చేయడం తన బాధ్యతని చెప్పారు.
తాను హ్యాండిల్ చేసిన కేసుల్లో బడుగు బలహీన వర్గాలు, పేదల పక్షాన నిలబడి వారికి చేయాల్సిన న్యాయం చేసినట్లు చెప్పారు. తను తీర్పు ఇచ్చిన కేసుల్లో ట్రిపుల్ తలాక్ కేసు, సహకార వ్యవస్థల పనితీరుపై ఇచ్చిన రూలింగ్ తనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు. ఇక రిటైర్ అవ్వడానికి ఒక్క రోజు ముందు ఆయన మరణ శిక్షపై తీర్పు రాశారు. "ప్రతి మరణ శిక్ష కేసు రాజ్యాంగానికి లోబడే ఉంటుంది. రాజ్యాంగ పరంగా రక్షణ కలిగి ఉంటుంది. ఇక తప్పని పరిస్థితుల్లో మరణ శిక్ష విధించాల్సి వస్తే అప్పుడు కూడా రాజ్యాంగంలోని అత్యున్నత ప్రమాణాలు పాటించాల్సిందే "అంటూ తీర్పు రాశారు.
ఎగ్జిక్యూటివ్ న్యాయవ్యవస్థల సంబంధం గురించి జస్టిస్ కురియన్ మాట్లాడారు. ప్రజల నుంచి చట్టం రాజ్యాంగం తయారవుతుంది. ప్రజలకు ఏది అవసరమో దాన్నే ప్రభుత్వాలు అమలు చేస్తాయని చెప్పారు. ప్రభుత్వాలు జనరంజక పాలన అందిస్తే కోర్టుల అవసరం ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నారు.