కరోనాపై వ్యాక్సిన్లు ఎంత ఎఫెక్టివ్-సింగిల్,డబుల్ డోసులతో ఎంత సేఫ్టీ-ఐసీఎంఆర్ ఆసక్తికర విషయాలు
కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించడంలో వ్యాక్సిన్లు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డా.బలరాం భార్గవ వెల్లడించారు. వ్యాక్సిన్ సింగిల్ డోసు తీసుకున్నవారిలో మరణం సంభవించే ముప్పు 96.6శాతం మేర నివారించబడుతోందన్నారు. రెండు డోసులు తీసుకున్నవారిలో ఆ ముప్పు 97.5శాతం మేర నివారించబడుతోందని చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు సేకరించిన డేటాతో ఈ విషయాన్ని నిర్దారించినట్లు తెలిపారు.

అన్ని వయసులవారిలో ఎఫెక్టివ్గా వ్యాక్సిన్లు...
కరోనా సెకండ్ వేవ్లో ఏప్రిల్-మే నెలల్లో సంభవించిన మరణాల్లో ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోనివారే ఉన్నారని బలరాం భార్గవ వెల్లడించారు. వ్యాక్సిన్ల పనితీరు అన్ని వయసుల వారిలో ప్రభావవంతంగా ఉందన్నారు. 18 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్లు పైబడ్డవారి వరకూ అందరిలోనూ వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తోందన్నారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారికి కరోనా వైరస్ నుంచి పూర్తి రక్షణ లభిస్తోందనే విషయం ఈ డేటాతో స్పష్టమైందని నీతి ఆయోగ్ సభ్యుడు,కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డా.వీకే పాల్ స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ 72 కోట్ల మందికి....
'18 ఏళ్లు దాటిన 58శాతం మందికి ఇప్పటివరకూ వ్యాక్సిన్ సింగిల్ డోసు అందింది. ఇది 100 శాతానికి చేరాలి. ఏ ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోకుండా మిగిలిపోవద్దు. ఇప్పటివరకూ మొత్తం 72 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. హెర్డ్ ఇమ్యూనిటీ రావాలంటే మిగతావాళ్లు కూడా వ్యాక్సిన్ వేయించుకోవాలి.' అని వీకే పాల్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ బారినపడే అవకాశం ఉంటుందని... అయితే అలాంటి కేసుల్లో మరణం సంభవించే ప్రమాదం ఉండదని అన్నారు. అప్పటికే వ్యాక్సిన్ తీసుకుని ఉండటం వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా తక్కువేనని అన్నారు.

మరింత వేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్...
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగంగా పుంజుకుంటోందని కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ తెలిపారు. గత మే నెలలో రోజుకు సగటున 20 లక్షల డోసులు వేయగా... సెప్టెంబర్లో ఆ సంఖ్య 78 లక్షలకు చేరిందన్నారు.గడిచిన 24 గంటల్లో 86 కోట్ల మందికి డోసులు పంపిణీ చేశామన్నారు.ప్రస్తుతం పండుగల సీజన్లో వ్యాక్సినేషన్ మరింత వేగంగా జరగాలని, వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వాళ్లకు వ్యాక్సిన్ త్వరగా వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

కొత్త కరోనా కేసుల వివరాలు...
దేశవ్యాప్తంగా గురువారం 43,263 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొన్నటితో పోలిస్తే దాదాపు ఆరు వేల కేసులు పెరగడం గమనార్హం. గత 24 గంటల్లో 338 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1.19 శాత యాక్టివ్ కేసులు ఉన్నాయి.తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. ఇప్పటివరకు భారత దేశంలో కరోనా కారణంగా 4,41, 749 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో 40, 567 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. రోజువారి నమోదైన కేసుల తో పోలిస్తే, నమోదైన రికవరీలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశం . ఇప్పటి వరకు దేశంలో 3.23 కోట్ల మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం రికవరీ రేటు 97.48 శాతం గా ఉంది.
Recommended Video

కేరళలో తగ్గని కేసులు...
అటు కొత్త కేసులు పెరగడంతో యాక్టివ్ కేసులు మళ్లీ నాలుగు లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3,93,614 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 2.38 శాతంగా ఉంది. ఇది చాలా కాలంగా మూడు శాతం కంటే తక్కువగా నమోదవుతుంది. గత 24 గంటల్లో కేరళలో 30,196 కేసులు మరియు 181 మరణాలు సంభవించాయి. దేశంలో మొత్తం కరోనా కేసులలో కేరళ రాష్ట్రంలోనే అధికంగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,71,295 నమూనాలను పరీక్షించగా.. పాజిటివిటీ రేటు 17.63 శాతానికి పెరిగింది.












Click it and Unblock the Notifications