తీర్పు తరువాత అయోధ్య ఎలా ఉందంటే..? రామజన్మభూమి వాసుల మనోగతం.. ముస్లింలు కూడా.. !
లక్నో: దశాబ్దాల పాటు న్యాయస్థానాల్లో నలుగుతూ వచ్చిన అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదానికి శనివారం నాటితో తెర దించింది సుప్రీంకోర్టు. తన తీర్పును వెల్లడించింది. రామజన్మభూమికి అనుకూలంగా తీర్పు వెలువడటం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు ముస్లిం మతపెద్దలు, మౌల్వీలు కూడా తీర్పును స్వాగతిస్తుండటం ప్రాధాన్యతను సంతరిచుకుంది. దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా తీర్పు వెలువడిందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
అయోధ్యలో పరిస్థితి ఎలా ఉంది..
దీనికంతటికీ కారణమైన అయోధ్యపై ప్రస్తుతం అందరి దృష్టీ నిలిచింది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఈ టెంపుల్ టౌన్ తాజా పరిస్థితి ఎలా ఉందనే అంశంపై ఆరా తీస్తున్నారు. అయోధ్యలో పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, అసాధారణ స్థితిలో సాయుధ బలగాలను మోహరించిన నేపథ్యంలో.. తీర్పు అనంతరం ఎలాంటి వాతావరణం అక్కడ నెలకొని ఉందనే విషయంపై ఉత్కంఠత వ్యక్తమౌతోంది. తీర్పు తరువాత అయోధ్యలో సాధారణ పరిస్థితులే కొనసాగుతున్నాయి. అయోధ్యలో ఎక్కడ గానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదంటూ జిల్లా పోలీసు యంత్రాంగం వెల్లడించింది. అయినప్పటికీ.. భద్రతాపరమైన చర్యలను కొనసాగిస్తున్నామని పేర్కొంది. మరో 48 గంటల పాటు భద్రత బలగాలు అయోధ్యలోనే ఉంటాయని స్పస్టం చేసింది.
స్వాగతిస్తున్న అయోధ్య ప్రజలు..
దశాబ్దాల కాలం పాటు కొనసాగిన అయోధ్య భూవివాదంపై సుప్రీంకోర్టు రామజన్మభూమికి అనుకూలంగా తీర్పు వెల్లడించడాన్ని అయోధ్య వాసులు స్వాగతిస్తున్నారు. మతాలకు అతీతంగా, ప్రతి ఒక్కరు కూడా సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య వివాదానికి తెర పడిన నేపథ్యంలో.. క్రమంగా తమ ప్రాంతం.. ఇక చారిత్రాత్మక పట్టణంగా మారుతుందని అన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు అయోధ్య వివాదంపై కొనసాగడం వల్ల అయోధ్యలో నెలకొన్న అనిశ్చిత వాతావరణానికి తెర పడినట్టయిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఫలితంగా- తమ వ్యాపారాలు మరింత పెరుగుతాయని, ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు అయోధ్య వాసులు.
సాధారణ పరిస్థితులు..
తీర్పు తరువాత అయోధ్యలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనసంచారం పెద్దగా లేదు. అయినప్పటికీ.. దుకాణాలు తెరిచే ఉన్నాయి. రెండో శనివారం సెలవు రోజు కావడం వల్ల స్థానికులు కాస్త పెద్ద సంఖ్యలోనే రోడ్లపైకి తిరుగాడుతుంటారని, కట్టుదిట్టమైన భద్రత ఉండటం వల్ల సాధారణ స్థాయిలో కంటే జనసమ్మర్థం తక్కువే ఉందని స్థానిక దుకాణదారులు చెబుతున్నారు. సాయంత్రానికి జనం రద్దీ పెరగడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీర్పు అనంతరం అవాంఛనీయ పరిస్థితులు తలెత్తడానికి అవకాశం ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించిన విషయం తెలిసిందే.
144 సెక్షన్ కొనసాగింపు..
కాగా- ప్రస్తుతం అయోధ్యలో ఉన్న 144 సెక్షన్ మరో రెండు రోజుల పాటు కొనసాగిస్తామని భద్రతా అధికారి వెల్లడించారు. సోమవారం తరువాతే భద్రతా బలగాలను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు. తీర్పు వెలువడటానికి ముందు కాస్త ఉద్రిక్తంగా, ఆందోళనకరంగా కనిపించిన అయోధ్య నగరం.. ఆ తరువాత సాధారణ స్థితికి చేరుకుందని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని, అయోధ్య మొత్తాన్నీ డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత హిందూ కార్యకర్తలు ర్యాలీను నిర్వహించడానికి ప్రయత్నించినప్పటికీ.. వారిన వారించి వెనక్కి పంపించేసినట్లు చెప్పారు.