శానిటైజర్లతో మద్యం తయారీ: ఆరుగురు నిందితుల అరెస్ట్, 300 లీటర్లు సీజ్
న్యూఢిల్లీ: శానిటైజర్లతో మద్యం తయారు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా రామనాథన్ కుప్పంలో చోటు చేసుకుంది. శానిటైజర్లతో మద్యం తయారు చేస్తున్న సమాచారంతో తయారీ కేంద్రం వద్దకు వెళ్లిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు తయారు చేస్తున్న మద్యంలో శానిటైజర్లు ఉపయోగిస్తున్నారని వైద్య శాఖ అధికారులు తేల్చారు. నిందితుల వద్ద నుంచి 300 లీటర్ల హ్యాండ్ శానిటైజర్లను, ఖాళీ బాటిళ్లను, టాటా ఏస్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కరోనా లాక్డౌన్ కారణంగా తమిళనాడు ప్రభుత్వ సంస్థ టీఏఎస్ఎంఏసీల ద్వారా నడుస్తున్న మద్యం షాపులు మూతపడ్డాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మే 24 వరకు ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ విధించింది.
కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించిన నాటి నుంచి శానిటైజర్ల వినియోగం పెరిగిన విషయం తెలిసిందే. కరోనా దరిచేరకుండా చేతులకు శానిటైజర్లను రాసుకోవడం జరుగుతోంది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా, అన్ని ప్రాంతాలను వైరస్ రహితంగా చేసేందుకు శానిటైజ్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు శానిటైజ్ తాగి ప్రాణాలు పోగొట్టుకున్న విషయం తెలిసిందే.
కాగా, తమిళనాడులో బుధవారం 34,875 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 16,99,225కి చేరింది. 365 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 18,734కు చేరింది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో 2,53,576 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications