ఆరుగురు బాలికలతో నగ్నంగా భిక్షాటన... ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని...
ఆచార సాంప్రదాయాల పేరుతో కొన్నిచోట్ల ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణిలో ఉన్నాయి.తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వర్షాలు కురవాలని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి... వారితో ఇంటింటికి భిక్షాటన చేయించారు.జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానిక కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.
దామోహ్ జిల్లాలోని బనియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో తక్కువ వర్షపాతం నమోదవడంతో గ్రామస్తులంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చారు.దాని ప్రకారం.. వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి బాలికలతో నగ్నంగా భిక్షాటన చేయించారు. ఓ కర్రకు మధ్యలో కప్పను వస్త్రంలో చుట్టి.. బరువైన రోలును దానికి కట్టి.. బాలికలతో దాన్ని మోయించారు. ఆరుగురు బాలికలు దాన్ని మోసుకుంటూ గ్రామంలోని ఇళ్లన్నీ తిరుగుతూ నగ్నంగా భిక్షాటన చేశారు.

అలా సేకరించిన బియ్యం,పప్పులు,ఇతరత్రా ఆహార పదార్థాలను గ్రామ దేవత ఆలయం ఎదురుగా ఉన్న కమ్యూనిటీ కిచెన్(భందారా)కు దానం చేస్తారు. అనంతరం అక్కడ అన్నదానం నిర్వహిస్తారు. గ్రామస్తులంతా దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇలా చేయడం ద్వారా వర్షాలు కురుస్తాయనేది వారి నమ్మకం.
ఈ ఘటనపై జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విచారణ జరిపి నివేదిక అందజేయాల్సిందిగా దామోహ్ కలెక్టర్ను ఆదేశించింది. ఇప్పటికైతే ఈ ఘటనపై ఎవరి నుంచి ఫిర్యాదు అందలేదని కలెక్టర్ తెలిపారు. ఇలాంటి కేసుల్లో ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు మాత్రమే జిల్లా అధికారులు చేపట్టగలరని పేర్కొన్నారు. ఆ బాలికలతో ఇది బలవంతంగా చేయించారా లేక వారి ఇష్ట ప్రకారమే జరిగిందా అనే విషయాన్ని ప్రస్తుతం ఆరా తీస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. అందులో నగ్నంగా భిక్షాటన చేస్తున్న బాలికలతో కలిసి కొంతమంది మహిళలు భజన పాటలు పాడుతుండటం కనిపిస్తోంది. కరువు పంటలు ఎండిపోతున్నందునే ఇలా చేస్తున్నామని కొంతమంది మహిళలు పేర్కొనడం అందులో వినిపిస్తోంది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications