కర్నాటకలో బస్సు ప్రమాదం, ఆరుగురు సజీవ దహనం
బెంగళూరు: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో పన్నెండు మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు దావణగెరె నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత 1.30 గంటల సమయంలో చిత్రదుర్గ వద్ద ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
దావణగెరె నుంచి బెంగళూరు వెళ్తుండగా హిరాయూరు తాలుకా మేటికుర్తి వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు పూర్తిగా దగ్ధమైంది. హిరియూరు నుండి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. బస్సు ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
బంగారం స్వాధీనం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం చెక్ పోస్టు వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ.15 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మణప్పురం ఫైనాన్స్ సంస్థకు చెందిన ఈ బంగారాన్ని సరైన పత్రాలు లేకుండా తరలిస్తుండటంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.