భారత్ లో కాస్త తగ్గిన కేసులు ; గత 24 గంటల్లో 45,352 కొత్త కేసులు, 366 మరణాలు
భారతదేశంలో కరోనా కేసుల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న రెండు నెలల గరిష్టానికి చేరిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గినట్లుగా కనిపిస్తున్నాయి. మరోపక్క కరోన థర్డ్ వేవ్ ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. గత 24 గంటల్లో భారతదేశంలో 45,352 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక రోజు 366 మరణాలు నమోదయ్యాయి. దీనితో, దేశం మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కి పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం మరణాల సంఖ్య 4,39,895 కి పెరిగింది.
దేశంలో 3,99,778 కరోనా యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 34,791 కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ఇప్పుడు 3,99,778 కి చేరుకున్నాయి. ప్రస్తుతం రికవరీ రేటు 97.45 శాతంగా ఉంది. ఇప్పుడు వరకు దేశవ్యాప్తంగా 3.20 కోట్ల మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు.
రికవరీల కంటే కొత్త కేసులు పెరుగుతున్న తీరు భారతదేశానికి ఆందోళన కలిగిస్తుంది. క్రియాశీల కేసుల రేటు 1.22 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధప్రాతిపదికన కొనసాగుతోంది. నిన్న74 .84 లక్షల మందికి వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. ఇప్పటివరకు మొత్తంగా 67.09కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేరళ లో కరోనా కల్లోలం .. ఆ తర్వాత స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలు
భారతదేశంలో నివేదించబడిన కొత్త కేసులు మరియు మరణాలలో, నిన్న కేరళలో 32,097 కేసులు మరియు 188 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో దాదాపు 80 శాతం కేసులు కేరళ రాష్ట్రం నుండి నమోదు కావడం గమనార్హం. కేరళ రాష్ట్రం తర్వాత మహారాష్ట్రలో గత 24 గంటల్లో 4342 కరోనా కేసులు నమోదయ్యాయి. 55 మంది కరోనా మహమ్మారి కారణంగా మృత్యువాత పడ్డారు ఇక ఆ తర్వాత తమిళనాడులో 1562 కరోనా కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్లో 1378, కర్ణాటక రాష్ట్రంలో 1240 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా పంజా
ఇక ఈశాన్య రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభణ కొనసాగుతుంది. మిజోరాంలో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. నిన్న మిజోరాంలో 1111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక అస్సాంలో 554 కరోనా కేసులు నమోదు కాగా ఒడిశాలో 754 కరోనా కేసులు, పశ్చిమ బెంగాల్లో 695 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీలో మాత్రం 39 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఢిల్లీలో కరోనా కేసులు కంట్రోల్ లోకి రావటం ఒకింత ఊరట కలిగించే అంశం.
Recommended Video
కొత్త వేరియంట్ లతో మరింత టెన్షన్ .. మూడో వేవ్ భయం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ము అనే కొత్త కరోనావైరస్ "వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్" ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. కొత్త వేరియంట్ వ్యాక్సిన్లకు నిరోధక సంకేతాలను చూపుతుందని హెచ్చరించింది. కొత్త వేరియంట్ మొదట కొలంబియాలో జనవరి 2021 లో గుర్తించబడిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఇదిలా ఉంటే కరోనా థర్డ్ వేవ్ సెప్టెంబరు అక్టోబరు నెలల్లో వస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేయగా, మరికొందరు కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అంతగా ఉండబోదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదిఏమైనప్పటికీ దేశంలో నిత్యం 40 వేలకు పైగానే కరోనా కేసులు ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం.