కేంద్రమంత్రిపై చెప్పు విసిరారు: 'రజనీ క్రిష్' మృతిపై తమిళనాట ఆగ్రహ జ్వాలలు
రోహిత్ వేముల ఆత్మహత్య తరహాలో మరో వ్యవస్థీస్తృత హత్య జరిగిందంటూ పలువురు ప్రజాస్వామికవాదులు ఆరోపిస్తున్నారు.
సేలం: ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీలో దళిత పరిశోధక విద్యార్థి ముత్తుకృష్ణన్(రజనీ క్రిష్) ఆత్మహత్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. రోహిత్ వేముల ఆత్మహత్య తరహాలో మరో వ్యవస్థాగత హత్య జరిగిందంటూ పలువురు ప్రజాస్వామికవాదులు ఆరోపిస్తున్నారు.
సోమవారం నాడు రజనీ క్రిష్ ఆత్మహత్యకు పాల్పడగా.. బుధవారం నాడు తమిళనాడులోని అతని స్వగ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియలకు హాజరైన కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ కు చేదు అనుభవం ఎదురైంది. రజనీ క్రిష్ ఆత్మహత్యను నిరసిస్తున్న ఆందోళనకారుల్లో ఒకరు ఆయనపై చెప్పు విసిరారు.
రజనీ క్రిష్ ఆత్మహత్యతో తమిళనాట ఆందోళనలు మొదలయ్యాయి. కుల వివక్షతో ప్రొఫెసర్ పెడుతున్న వేధింపులు తాళలేకే రజనీ క్రిష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తమిళ అభిమాన సంఘాలు, పార్టీలు ఆరోపించాయి. రజనీ క్రిష్ మృతిపై న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో చెన్నైలోని బీజేపీ కార్యక్రమాన్ని ముట్టడించడానికి నిరసనకారులు ప్రయత్నించారు.
ఫేస్బుక్ లో రజనీ క్రిష్ చివరి మాటలు:
'సమానత్వం నిరాకరించబడినప్పుడు సమస్తమూ నిరాకరించబడినట్టే. ఎంఫిల్/ పీహెచ్డీల అడ్మిషన్లలో ఎలాంటి సమానత్వమూ లేదు. వైవా -వోస్ లలో సమానత్వం లేదు. ఉన్నదల్లా సమానత్వాన్ని నిరాకరించడం, ప్రొ. సుక్దేవ్ సూచనలను నిరాకరించడం, అడ్మిన్ బ్లాక్ లో విధ్యార్ధుల నిరసనను నిరాకరించడం, నిమ్న వర్గాల విద్యను నిరాకరించడం.'