పేపర్పై రాసుకొని: సోనియాకు స్మృతి ఇరానీ ఘాటుగా
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు. వ్యాపం, 25 మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్, లలిత్ గేట్ అంశాలు పార్లమెంటును కుదిపేస్తున్నాయి.
లలిత్ గేట్ పైన కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ వివరణ ఇవ్వడం, ఆ తర్వాత దానిపై సోనియా గాంధీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్మృతి ఇరాని తనదైన శైలిలో సోనియా పైన విరుచుకుపడ్డారు. ఘాటైన విమర్శలు చేశారు.
ఏదైనా అంశం పైన ప్రసంగం ఇవ్వడం సోనియా గాంధీకి అంత సులభం కాదన్నారు. ప్రసంగ పాఠాన్ని పేపర్ పైన రాసుకొని సాంతం చదువుకున్నాకే మాట్లాడగలరని ఎద్దేవా చేశారు.
సుష్మ పైన చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. పార్లమెంటును వారు స్టేజి అనగరలా అని నిలదీశారు. సుష్మా మాటల గారడి చేస్తున్నారన్న వ్యాఖ్యలను స్మృతి ఇరానీ తప్పుబట్టారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ ఎంపీల సస్పెన్షన్ పైన నాలుగు రోజులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలో ఆ పార్టీ ఎంపీలు పార్లమెంటులో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఎన్డీఏ ప్రభుత్వంపైనే కాక ప్రధాని నరేంద్ర మోడీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పై కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు.