Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!!
భారత సరిహద్దులు..శత్రువుల చొరబాటుకు,స్మగ్లర్ల అక్రమ రవాణాకు నిరంతరం నిలయంగా మారుతున్నాయి.ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని నదీ పరివాహక ప్రాంతాలు బిఎస్ఎఫ్ జవాన్లకు పెద్ద సవాలుగా మారాయి. అయితే, ఇప్పుడు ఈ చొరబాటుదారుల వెన్నులో వణుకు పుట్టించేలా కేంద్ర ప్రభుత్వం ఒక భీకరమైన ప్లాన్ వేస్తోంది. తుపాకీ గుళ్లకు దొరకని వారికి..పాము కాటుతో,మొసలి వేటుతో బుద్ధి చెప్పాలని చూస్తోంది.అవును..మీరు చదివింది నిజమే. సరిహద్దుల్లో సరీసృపాల సైన్యాన్ని మోహరించబోతున్నారు.అసలేమిటి ఈ వింత వ్యూహం? దీని వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి?
సంచలన ప్రతిపాదన
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులు దాదాపు 4,096 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి.ఇందులో అధిక భాగం నదులు,చిత్తడి నేలలు,దట్టమైన అడవులు ఉన్నాయి.ఇక్కడ ఫెన్సింగ్ వేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది.వరదలు వచ్చినప్పుడు కంచె కొట్టుకుపోవడం..లేదా జనసాంద్రత వల్ల నిఘా కష్టమవ్వడం స్మగ్లర్లకు వరంగా మారుతోంది.చొరబాటుదారులు నదుల గుండా సులువుగా భారత్లోకి ప్రవేశిస్తున్నారు.ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాలతో..బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)ఈ సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది.

పాములు మొసళ్లతో చెక్
కీలకమైన నదీ ప్రాంతాల్లోకి ప్రమాదకరమైన విష సర్పాలను,ఆకలితో ఉన్న మొసళ్లను వదలడమే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం.నీటి గుండా దొంగచాటుగా వచ్చే వారికి ఈ సరీసృపాలు సింహస్వప్నంలా మారుతాయి.అయితే,ఈ ఆలోచన వినడానికి పటిష్టంగా ఉన్నా..అమలులో మాత్రం కొండంత సవాళ్లు ఉన్నాయి.మొదటిది..ఇన్ని వేల పాములు, మొసళ్లను ఎక్కడి నుండి సేకరించాలి?
రెండవది.. సరిహద్దుకు ఇరువైపులా సాధారణ ప్రజలు నివసిస్తున్నారు.వరదలు వచ్చినప్పుడు ఈ క్రూర మృగాలు జనావాసాల్లోకి కొట్టుకొస్తే పరిస్థితి ఏంటి? అందుకే,ఈ ప్రతిపాదనపై బిఎస్ఎఫ్ తన ప్రాంతీయ కేంద్రాలకు లేఖలు రాసింది. క్షేత్రస్థాయిలో దీని సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించింది.
సాంకేతికతతో కూడిన థర్మల్ కెమెరాలు, డ్రోన్లు పనిచేయని చోట.. ప్రకృతి సిద్ధమైన ఈ రక్షణ కవచం ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు జంతు ప్రేమికుల అభ్యంతరాలు, మరోవైపు సరిహద్దు భద్రత.. ఈ రెండింటి మధ్య సమతుల్యత పాటిస్తూ బిఎస్ఎఫ్ ముందడుగు వేయాల్సి ఉంది. చొరబాటుదారుల ఆట కట్టించడానికి నాగు పాము బుస కొడుతుందో లేదో వేచి చూడాలి. ఏది ఏమైనా, దేశ రక్షణ కోసం భారత్ తీసుకుంటున్న ఈ అసాధారణ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications