'ఆ చీపురుతోనే మోడీని కేజ్రీ ఊడ్చేశారు': నాడు కాంగ్రెస్కు, నేడు బీజేపీకి
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు, భారతీయ జనతా పార్టీ ఓటమిల పైన సోషల్ మీడియాలో అభినందనలు, విమర్శలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్కు ప్రశంసలు కురిపించిన నెటిజన్లు, ప్రధాని నరేంద్ర మోడీ పైన సెటైర్లు వేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లలో స్పందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా చురకలు వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ మూటాముల్లె సర్దేసుకొని పలాయం చిత్తగించాలని కొందరు వ్యాఖ్యానించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా ఢిల్లీ ఓటర్లు మోడీని ఊడ్చిపారేశారని కొందరు పేర్కొన్నారు. రాజధానిలో మోడీ హవా, అమిత్ షా మేజిక్ ఏమీ లేదని అర్థమవుతోందన్నారు.
కేవలం కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీని నామరూపాల్లేకుండా చేశాయని మరికొందరు పేర్కొన్నారు. చాయ్వాలా అంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ లక్షలు పెట్టి సూట్లు కుట్టించుకోవడాన్ని ప్రజలు కనిపెడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రముఖ వ్యక్తులు చేతన్ భగత్, శేఖర్ కపూర్, అశుతోష్, సాధవి ఖోస్లా దలాల్ తదితర ఎందరో స్పందించారు.
నాడు కాంగ్రెస్కు జరిగిన పరాభవం.. నేడు బీజేపీకి
నాడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జరిగిన పరాభవం నేడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జరిగింది. పదేళ్ల యూపీఏ పాలన వైఫల్యం, మోడీ హవా కారణంగా బీజేపీ నాడు ఘన విజయం సాధించింది. ఆ హవా నిన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగింది. మోడీ హవా కారణంగా సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇప్పుడు కేజ్రీవాల్ ధాటికి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.