మళ్లీ తెగబడ్డ పాక్: జవాను, మహిళ మృతి
శ్రీనగర్: సర్జికల్ దాడులతో భారత్ గట్టి సమాధానం ఇచ్చినా.. పాకిస్థాన్కు బుద్ధి రావడం లేదు. జమ్మూకాశ్మీర్లోని పూంచ్, రాజౌరీ జిల్లాలో ఎల్ఓసి వద్ద పాక్ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయి. రాజౌరీ సెక్టార్లో పాక్ రేంజర్లు భారత శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారీఎత్తున కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్ల కాల్పుల్లో ఓ జవాను మృతి చెందాడని ఉత్తర మండల సైనిక ప్రతినిధి వెల్లడించారు.
పూంచ్ సెక్టార్లో గాయపడ్డ ఇద్దరు మహిళల్లో ఒకరు పరిస్థితి ఆందోళకరంగా ఉందని, ఆమెను జమ్మూలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్పత్రికి తరలించినట్టు పూంచ్ ఎస్పీ జెఎస్ జోహార్ వెల్లడించారు. కాగా, చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందినట్లు తెలిసింది. జంట జిల్లాల సరిహద్దులోని ఎల్ఓసి వద్ద సోమవారం తెల్లవారుజామున పాక్ రెంజర్లు కాల్పులకు తెగబడ్డారని ఆయన తెలిపారు. భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని గ్రామంపై ఫిరంగి దాడులు చేశారన్నారు.
'బాల్కోట్ సెక్టార్లో 120ఎంఎం, 82 ఎంఎం మోర్టార్స్, అత్యాధునికమైన చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఉదయం 9 గంటలకు రేంజర్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు' అని సైనికాధికారి ఒకరు పేర్కొన్నారు. పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లో జనవాసాలపైనా కాల్పులు జరిపారన్నారు. పాక్ దళాలు రాజౌరీ జిల్లాలోనూ కాల్పుల వివరణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టు ఆయన చెప్పారు. పాక్ రేంజర్లను తిప్పికొట్టినట్టు వెల్లడించారు.
జమ్మూ, కతువ, సాంబ జిల్లాల్లో అంతర్జాతీయ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ పోస్టులు, జనవాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు కాల్పులకు దిగారన్నారు. ఇలా ఉండగా.. భారత్ సర్జికల్ దాడుల తరువాత అంతర్జాతీయ సరిహద్దులో పాక్ రేంజర్లు అరవైసార్లు కాల్లుల వివరణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు.
కాల్లుల్లో ఎనిమిది మంది సైనికులతోసహా 11 మంది మృతి చెందారు. కనీసం 40 మంది గాయపడ్డారు. స్థానిక ప్రజలే ఎక్కువ మంది గాయపడ్డారు. కతువ జిల్లాలోని హీరానగర్ సెక్టార్లో ఆదివారం రాత్రి పది గంటల ప్రాంతంలో పాక్ సైనికులు కాల్పులు జరిపినట్టు బిఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ధర్మేంద్ర పరీక్ చెప్పారు.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు
సోమవారం ఉదయం నుంచి కాల్పులకు తెగబడిన పాక్.. మంగళవారం ఉదయం వరకు కాల్పులను తీవ్రతరం చేసింది. పూంఛ్, సాంబా, రాజౌరి సెక్టార్లలోని భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని పాక్ సైన్యం ఓ వైపు, ఉగ్రవాదులు మరో వైపు కాల్పులకు తెగబడుతున్నారు. పాక్ సైన్యానికి, ఉగ్రవాదులకు భారత సైన్యం ధీటైనా జవాబిస్తోంది.