మోడీకి మద్దతుపై నితీష్: ఇది నన్ను రాజకీయంగా హత్య చేసే కుట్ర
జర్నలిస్టుల ప్రశ్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇది తనను రాజకీయంగా హత్య చేసేందుకు జరుగుతున్న కుట్ర అని నితీష్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది.
న్యూఢిల్లీ: ప్రతిపక్షాలన్ని నోట్ల రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వేళ.. ప్రధాని మోడీకి బీహార్ సీఎం నితీష్ మద్దతు తెలపడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. మిత్రపక్షమైన ఆర్జేడీ ఓవైపు మోడీ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నా.. నితీష్ మాత్రం తన మాటకే కట్టబడి ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే.. బీజేపీకి నితీష్ దగ్గరవుతున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయాన్ని కొంతమంది జర్నలిస్టులు నితీష్ వద్ద ప్రస్తావించగా.. తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట నితీష్. తనను బీజేపీకి దగ్గరవుతున్నానని అనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇది తనను రాజకీయంగా హత్య చేసేందుకు జరుగుతున్న కుట్ర అని నితీష్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది.

జర్నలిస్టులు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని.. ముమ్మాటికి ఇది ఎల్లో జర్నలిజమేనని నితీష్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టు సమాచారం. తాను ప్రజాస్వామిక వాదిని కాబట్టి ఊరుకుంటున్నానని, వేరే రాష్ట్రంలో అయితే కేసులు పెట్టి జర్నలిస్టులను జైలుకు పంపేవారని నితీష్ హెచ్చరించారట. విధానసభ ఛాంబర్ లో నితీష్ కు జర్నలిస్టులకు మధ్య ఈ వాడి-వేడి వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తోంది.
'ఎన్డీయేకు బాహాటంగానే మద్దతునిస్తున్నారు.. పైగా అమిత్ షా లాంటి బీజేపీ నేతలు సైతం మిమ్మల్ని బాగానే పొగుడుతున్నారు..' అంటూ నితీష్ వద్ద ప్రస్తావించారట జర్నలిస్టులు. జర్నలిస్టుల ప్రశ్న వినగానే నితీష్ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారని.. అందుకే ఎప్పుడు లేనివిధంగా గట్టిగానే హెచ్చరించారని చెబుతున్నారు. కాగా, మోడీ నిర్ణయాన్ని సమర్థించడం పట్ల నితీష్ ను అమిత్ షా ట్వీట్ల ద్వారా పొగడ్తల్లో ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications