సుప్రీం కోర్టును ఆశ్రయించిన సోమనాథ భారతీ
న్యూఢిల్లీ: తన అరెస్టును నిలిపేయాలంటూ మాజీ మంత్రి, ఢిల్లీ ఆప్ శాసన సభ్యుడు సోమనాథ భారతీ చివరికి సుప్రీం కోర్టు మెట్లెక్కారు. తనను ఢిల్లీ పోలీసులు అరెస్టు చెయ్యకుండా రక్షించాలని పిటిషన్ దాఖలు చేశారు. సోమనాథ్ భారతి కోసం ఢిల్లీ పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే.
తనను చిత్రహింసలకు గురి చేశారని, రెండు సార్లు హత్య చెయ్యడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ సోమనాథ భారతీ భార్య లిపికా మిత్రా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పలు సార్లు సోమనాథ భారతీని విచారణ చేశారు.
అప్పట్లో ఢిల్లీ న్యాయశాఖ మంత్రిగా ఉన్న సోమనాథ భారతీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇటీవల ఢిల్లీ హై కోర్టు సోమనాథ భారతీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పటి నుంచి ఆయన మాయం అయ్యారు. ఢిల్లీ పోలీసులు పలు బృందాలతో సోమనాథ భారతీ కోసం గాలిస్తున్నారు.
అయితే ఆయన ఆచూకి తెలియడం లేదని పోలీసులు అంటున్నారు. ఇప్పుడు సోమనాథ భారతీ తరుపున ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే త్వరలో సోమనాథ భారతీని అరెస్టు చేస్తామని ఢిల్లీ పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.