పార్లమెంట్ ప్రాంగణంలో సోనియా నిరసన- రాహుల్..పార్టీ ఎంపీలతో కలిసి : రైతు చట్టాలు రద్దు కోసం..!!
కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ..రాహుల్ గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే ప్రధాని మోదీ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీనికి అనుగుణంగా ఇప్పటికే కేబినెట లోనూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజున లోక్ సభలో కేంద్రం తాము గతంలో తెచ్చిన రైతు చట్టాలను ఉప సంహరించుకుంటూ బిల్లును ప్రవేశ పెట్టనుంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ మాత్రం భవిష్యత్ లో తిరిగి ఈ బిల్లులను తెచ్చే ప్రమాదం ఉందని ఆరోపిస్తోంది. అందుకు ప్రధాని బిల్లుల ఉపసంహరణ ప్రకటనలోని అంశాలను ప్రస్తావిస్తోంది. ఇక, రైతులు డిమాండ్ చేస్తున్న కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తోంది. కానీ, ఈ చట్టం తీసుకువచ్చే అంశం పైన కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇక, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా..కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. నల్ల సాగు చట్టాలను రద్దు చేయాలంటూ భారీ బ్యానర్తో పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం ముందు ధర్నా చేపట్టారు.
Congress President Smt. Sonia Gandhi leads our protest against the draconian farm laws imposed by the Modi govt, in the presence of Shri @RahulGandhi and other MPs.
— Congress (@INCIndia) November 29, 2021
The Congress party will not rest until the interests of our farmers are upheld. pic.twitter.com/RKBNLgFu66
అంతకు ముందు విపక్షాలతో కలిసి కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ సైతం ప్రభుత్వం అన్ని అంశాల పైన చర్చకు సిద్దంగా ఉందని సమావేశాల ముందు ప్రకటించారు. ఈ సమావేశాలు కీలకమైనవిగా పేర్కొన్నారు. ఈ నిరసనలో లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అధర్ రంజన్ చౌదరి.. రాజ్యసభలో పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే సైతం పాల్గొన్నారు. అయితే, సభలోనూ విపక్షాలు ఈ చట్టాల రద్దు పైన చర్చ చేపట్టాలంటూ నినాదాలు చేసారు. ఈ అంశం పైన విపక్షాల ఆందోళనతో సభ వాయిదా పడింది.