ప్రధాని పదవిపై ఆశలేని వారే: సోనియా గాంధీ-దేవేగౌడలపై శరద్ పవార్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పదవి కావాలని ఆశలు లేని తాను, మాజీ ప్రధాని దేవేగౌడ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ లాంటి వారమే బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటి కాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అన్నారు. ప్రస్తుతం దేశంలోని పరిస్థితి అత్యయికస్థితిని తలపిస్తోందన్నారు.
ప్రధానమంత్రి కావాలనే లక్ష్యం లేని ప్రతిపక్ష నేతలు ఏకం కావాలన్నారు. సోనియా, దేవెగౌడ, తాను ఒక్కటై దేశమంతా పర్యటించి బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. సోనియా, దేవెగౌడలతో పాటు తనకు ప్రధాని పదవిపై ఆశ లేదన్నారు. తమ లాగా ఆశ లేని నాయకులు చేతులు కలపాలన్నారు.
2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏకమై బీజేపీని ఓడించాలని వ్యూహాలు పన్నుతున్నాయి. మహారాష్ట్రలో బీఎస్పీతో పొత్తుకు పవార్ తొలిసారి సిద్ధమన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్లు పొత్తుకు సై అన్నాయి. పవార్ ప్రస్తుత రాజకీయ పరిస్థితిని 1975 - 77 కాలం నాటి పరిస్థితితో పోల్చారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ పట్ల ఏ విధంగా అయితే వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు మోడీ పట్ల కూడా అదే వ్యతిరేకత ఉందన్నారు.
దాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకోవాలన్నారు. జాతీయ స్థాయి పొత్తులకు బదులుగా రాష్ట్ర స్థాయిలో పొత్తులపై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రాల్లో సంకీర్ణాల పట్ల కాంగ్రెస్ హేతుబద్ధమైన పద్ధతిని అవలంబించాలన్నారు. ప్రతిపక్షాలను ఏకం చేసి, ప్రజలకు మరో ప్రత్యామ్నాయం చూపించడమే తన ముందున్న లక్ష్యమన్నారు.