17 పార్టీలకు సోనియా విందు: బాబు, కేసీఆర్లకు అందని అహ్వానాలు
న్యూఢిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి (యుపిఎ) చైర్ పర్సన్ సోనియా గాంధీ 17 పార్టీలతో మంగళవారం రాత్రి విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆహ్వానాలు అందుతాయని భావించారు.
Recommended Video
అయితే, కేసీఆర్, చంద్రబాబులనే కాకుండా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు కూడా ఆమె ఆహ్వానం పంపించలేదు. బిజెపికి వ్యతిరేకంగా బలమైన రాజకీయ శక్తిని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సోనియా ఈ సమావేశాన్ని తలపెట్టారు.
థర్డ్ ఫ్రంట్ ఎఫెక్ట్తో...
దేశ రాజకీయాల్లో మార్పు తేవడానికి థర్డ్ ఫ్రంట్ను ఏర్పాటు చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. దాంతో కేసీఆర్కు సోనియా గాంధీ ఆహ్వానం పంపించలేదని భావిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)ను ఎదుర్కోవడానికి సిద్ధపడింది. దీంతో కేసీఆర్తో జాతీయ స్థాయిలో పొత్తు కదురదనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది.పైగా, గతానుభవం కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటానని చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత మొండిచేయి చూపించారు.
చంద్రబాబును అందుకే పిలువలేదు...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజెపితో తన సంబంధాలపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి తన ఇద్దరు మంత్రులను ఉపసంహరించుకున్నప్పటికీ ఎన్డీఎ నుంచి టీడిపి తప్పుకోలేదు. దీంతో చంద్రబాబు ఎటు ఉంటారనే స్పష్టత లేకపోవడంతో సోనియా గాంధీ ఆహ్వానం పంపించలేదని అంటున్నారు.
వీరికి సోనియా ఆహ్వానం...
జార్ఖండ్ వికాస్ మోర్చాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మారండీ, జిఎంఎంకు చెందిన హేమంత్ సొరేన్లతో పాటు బీహర్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీలకు సోనియా నుంచి ఆహ్వానాలు అందినట్లు తెలుస్తోంది. జితన్ రామ్ మాంఝీ ఎన్డీఎ నుంచి ఇటీవలే వైదోలిగి లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జెడీతో కలిసిన విషయం తెలిసిందే. ఆర్జెడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.
తృణమూల్ నేత రావచ్చు కనిమొళి కూడా..
తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీకి సోనియా గాంధీ నుంచి ఆహ్వానం అందింది. ఆమె తరఫున సుదీప్ బంధోపాధ్యాయను పంపుతున్నారు. డిఎంకె నుంచి కనిమొళి హాజరు కావచ్చునని అంటున్నారు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన రామ్ గోపాల్ యాదవ్తో పాటు సీతారాం ఏచూరి (సిపిఎం), డి. రాజా (సిపిఐ సోనియా విందు సమావేశానికి హాజరయ్యే అవకాశాలున్నాయి. జెడిఎస్, కేరళ కాంగ్రెసు, ఇండియన్ యూనియన్ ముస్లిం లగ్, రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ, ఆర్ఎల్డీ నేతలు కూడా హాజరవుతారని భావిస్తున్నారు.
మాయావతికి ఆహ్వానం కానీ...
బిఎస్పీ నేత మాయావతికి సోనియా గాంధీ ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అయితే, మాయావతి సోనియా విందు సమావేశానికి తన ప్రతినిధిని పంపించే అవకాశం లేదని అంటున్నారు. త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో జెడిఎస్తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉండడమే అందుకు కారణమని అంటున్నారు.
సోనియా నివాసంలో విందు
తన నివాసం 10జనపథ్లో సోనియా గాంధీ విందు సమావేశం ఏర్పాటు చేశారు. వచ్చే సాధారణ ఎన్నికలకు సాధ్యమైనన్ని ఎక్కువ పార్టీలను కూడగట్టి ఎన్డీఎను ఎదుర్కోవాలనే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నారు. అందులో భాగంగానే ఆమె ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.