వారేదైనా అనవచ్చు, అది వారిష్టం: జైట్లీపై సోనియా
న్యూఢిల్లీ: తమ పార్టీపై రక్షణ మంత్రి, బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. కాంగ్రెసులో అంతర్గత తిరుగుబాటు ఉందని జైట్లీ అన్న విషయం తెలిసిందే. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. తమ పార్టీలో ఏ విధమైన తిరుగుబాటు లేదని ఆమె స్పష్టం చేశారు
వారు ఏది మాట్లాడదలుచుకుంటే అది మాట్లాడనీయండని సోనియా జైట్లీ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అన్నారు. పెరుగుతున్న మత ఉద్రిక్తతల సంఘటనలపై తక్షణ చర్చ జరగాలని పట్టుబడుతూ అనూహ్యంగా రాహుల్ గాంధీ స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లారు.
రాహుల్ గాంధీ విమర్శలకు ప్రతిస్పందిస్తూ అరుణ్ జైట్లీ కాంగ్రెసులో అంతర్గత తిరుగుబాటు జరుగుతోందని, అందుకే వారు ఆందోళన చెందుతున్నారని అన్నారు. సభలో మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని, ఒక్కరి గొంతు మాత్రమే వినిపించాలనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని రాహుల్ గాంధీ విమర్సించారు.
స్పీకర్ సుమిత్రా మహాజన్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు చేయడం సరి కాదని బిజెపి సభ్యుడు ప్రతాప్ రూఢీ అన్నారు. తనపై చేసిన ఆరోపణలు తాను పట్టించుకోబోనని, తాను వాటికి స్పందించబోనని సుమిత్రా మహాజన్ అన్నారు.