ఈడీ విచారణకు హాజరుకాబోతున్న సోనియా గాంధీ?
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఈనెల 21వ తేదీన ఈడీ విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గత నెలలోనే విచారణకు హాజరవ్వాల్సి ఉండగా ఆమెకు కరోనా సోకడంతో వాయిదా పడింది. విచారణకు హాజరుకాలేదంటూ సోనియాగాంధీకి తాజాగా సమన్లు జారీ చేయడంతో 21వ తేదీన విచారణను ఎదుర్కోవాలని ఆమె నిర్ణయించుకున్నారు.
సోనియా గాంధీ తనయుడు, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని గత నెలలో ఈడీ విచారించింది. ఐదు రోజులపాటు, 55 గంటలు ప్రశ్నించింది. ఇప్పుడు సోనియాగాంధీని ఎన్నిరోజులు ప్రశ్నిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. 21వ తేదీన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్యాదవ్ ప్రకటించారు. 21వ తేదీ ఉదయం 11.00 గంటలకు నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి ఈడీ కార్యాలయం వరకు నిర్వహించే ర్యాలీలో పార్టీ సీనియర్ నేతలంతా పాల్గొనబోతున్నారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిధులను దుర్వినియోగం చేశారంటూ బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి 2012లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసు పెట్టారు. నవంబర్ ఒకటో తేదీన ఢిల్లీలోని కోర్టులో సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు చేశారు.
యంగ్ ఇండియన్ ప్రైవేట్ కంపెనీ ద్వారా ఉత్తరప్రదేశ్, ఢిల్లీతోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న రూ. 1,600 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్) ఆస్తులను స్వాధీనం చేసుకున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ప్రచురిస్తుంది. ప్రస్తుతానికి ఈ పత్రిక ఆర్థిక ఇబ్బందుల కారణంగా మూతపడింది.