ప్రజల కష్టాలను చూడండి: పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని మోడీకి సోనియా గాంధీ లేఖ
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మూడు పేజీల లేఖ రాశారు. ప్రజల కష్టంతో ప్రభుత్వం లాభాలను గడిస్తోందని ఆరోపించారు. వెంటనే పెరిగిన చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఓ వైపు దేశ జీడీపీ క్షీణిస్తుంటే.. మరొవైపు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని మండిపడ్డారు.
చమురు, గ్యాస్ ధరలు పెరుగుదలతో ప్రజలు పడుతున్న బాధలు, కష్టాలు చూసే ఈ లేఖ రాస్తున్నట్లు సోనియా తెలిపారు. దేశంలో ఉద్యోగాలు పోతున్నాయని, ఆదాయాలు దారుణంగా పడిపోయాయని అన్నారు. పెరిగిన ధరలతో మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయంలో లాభార్జనపై ప్రభుత్వం దృష్టి సారించడం బాధాకరమని విమర్శించారు.
దేశంలో ఎప్పుడూ లేని స్థాయికి ధరలు చేరాయని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. చమురు ధరలు నిరంతరం పెరగడాన్ని ఆమె తప్పుబట్టారు. యూపీఏ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం క్రూడాయిల్ ధరలు సగం మాత్రమే ఉన్నాయని చెప్పుకొచ్చారు.
మరోవైపు.. వంట గ్యాస్ ధరలు పెరుగుతుండటంపై కూడా సోనియా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా.. వైఫల్యాలకు గత ప్రభుత్వాలను బాధ్యతులను చేయడమేంటని మండిపడ్డారు. ప్రభుత్వం లాభార్జన ఆలోచన వీడి ప్రజలపై భారం పడకుండా చూడాలని కోరారు. ఈ అంశంలో సాకులు వెతక్కుండా సమస్యకు సరైన పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు సోనియా లేఖలో పేర్కొన్నారు.