ఐఐటీ టాప్ ర్యాంకులు: పేదరికం వెంటాడింది
ఉత్తరప్రదేశ్: ఐఐటీలో టాప్ ర్యాంకులు సాధించిన ఇద్దరు అన్నదమ్ములు తాము ఉన్నత చదువులు చదువుతామో లేదో అని టెన్షన్ తో ఉన్నారు. మమ్మల్ని ఎవరైనా ఆదుకుంటే ఐఐటీలో చేరుతామని ఇద్దరు అన్నదమ్ములు దాతల కోసం ఎదురు చూస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గడ్ జిల్లా లోని రెహూవా లాల్ గంజ్ ప్రాంతంలో ధర్మరాజ్ సరోజ్ నివాసం ఉంటున్నాడు. ఇతను ఒక మిల్ లో రోజు వారి కూలిగా పని చేస్తున్నాడు. ఇతని కుమారులు రాజు (18), బ్రిజేష్(19) ఐఐటీలో మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు.
రాజుకు 167, బ్రిజేష్ కు 410 ర్యాంకులు వచ్చాయి. 500 ర్యాంకు లోపల వచ్చిన విద్యార్థులు దేశంలో నే ప్రసిద్ది చెందిన కళాశాలలో ప్రవేశం పోందడానికి అవకాశం ఉంది. ఈనెల 25వ తేదిన కౌన్సిలింగ్ ప్రారంభం అవుతున్నది.
ఐఐటీలో అడ్మీషన్ కోసం రూ. ఒక లక్ష అవసరం అయ్యింది. అడ్మీషన్ ఫీజు రూ. 30 వేలు, మొదటి సెమిస్టర్ ఫీజు రూ. 20 వేలు చెల్లించవలసి ఉంటుంది. అయితే ధర్మరాజ్ తన ఇద్దరు కుమారులకు ఫీజు చెల్లించలేక సతమతం అవుతున్నాడు.
కూలి చేసి 7 మంది కుటుంబ సభ్యులను పోషిచడం భారంగా ఉందని అంటున్నాడు. అయితే కుటుంబ పరిస్థితులు గమనించిన అన్నదమ్ములు దేవుడి మీద భారం వేసి దాతల కోసం ఎదురు చూస్తున్నారు. మంచి చదువులు చదివి కుటుంబ సభ్యులను బాగా చూసుకుంటామని నమ్మకంతో ఉన్నారు.