Twitter Verification: వెంకయ్య ట్విటర్ ఖాతాపై బ్లూటిక్ మార్క్ పునరుద్ధరణ-మోహన్ భగవత్కు తొలగింపు
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్ అధికారిక ఖాతాపై బ్లూ టిక్ మార్కును తొలగించిన తర్వాత కొద్దిసేపటికే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అధికారిక ట్విటర్ పై బ్లూ టిక్ను తొలగించింది మైక్రోబ్లాగింగ్ సైట్. మోహన్ భగవత్కు ట్విటర్పై 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతకుముందు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ట్విటర్ అకౌంట్పై ఉన్న బ్లూమార్క్ను తొలగించి ఆ తర్వాత కొద్దిసేపటికి తిరిగి పునరుద్ధరించింది.
వెంకయ్యనాయుడు ట్విటర్ ఖాతాపై బ్లూమార్క్ తొలగించడంపై వివరణ ఇచ్చింది ఈ సోషల్ మీడియా దిగ్గజం. గతేడాది జూలై 2020 నుంచి వెంకయ్యనాయుడు వ్యక్తిగత ఖాతా యాక్టివ్గా లేదని వివరణ ఇచ్చింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ట్వీట్ కూడా లేకపోవడంతోనే వెరిఫికేషన్ సందర్భంగా బ్లూ టిక్ను తొలగించినట్లు ట్విటర్ స్పష్టం చేసింది. ట్విటర్ పాలసీ ప్రకారం ఒక వ్యక్తి ఖాతా యాక్టివ్గా లేకపోయినా, లేదా పూర్తిగా లేకపోయినా నీలం రంగు టిక్ మార్కు తొలగించే హక్కు ఉంటుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చివరిసారిగా గతేడాది జూలై 23వ తేదీన చివరి ట్వీట్ చేశారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే తనకు ఎంతో ఇష్టమని అదే సమయంలో భవానీ మాతను కూడా పూజిస్తానని అయితే అది వ్యక్తిగతంగా తాను పాటిస్తానంటూ చివరిసారిగా ట్వీట్ చేశారు వెంకయ్య నాయుడు. సభలో ప్రమాణస్వీకారం చేసే సమయంలో నినాదాలు చేయరాదంటూ సభ్యులకు విజ్ఞప్తి చేస్తూ అదే ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక మోహన్ భగవత్ కూడా తన చివరి ట్వీట్ ఎప్పుడు చేశారో అనేదానిపై స్పష్టత లేదు. 2019 మే నెలలో మోహన్ భగవత్ తన ట్విటర్ ఖాతాను తెరిచారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు తన ఖాతాపై ఒక్క ట్వీట్కూడా కనిపించడం లేదు.