టికెట్, మంత్రి పదవి: గంగూలీకి మోడీ బంపర్ ఆఫర్
కోల్కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తామని, గెలిస్తే క్రీడా మంత్రి పదవి ఇస్తామని బిజెపి నాయకత్వం సౌరవ్ గంగూలీకి చెప్పినట్లు సమాచారం. అయితే, దానిపై గంగూలీ ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. త్వరలో తన నిర్ణయం చెబుతానని ఆయన అన్నట్లు చెబుతున్నారు.
తనకు ఆఫర్ ఉందని, అయితే తాను ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని గంగూలీ అన్నాడు. గత కొద్ది రోజులుగా తనకు తీరిక లేదని, త్వరలోనే తన నిర్ణయం చెబుతానని అన్నట్లు ఓ ప్రముఖ బెంగాలీ పత్రిక రాసింది.
మిత్రుడి ద్వారా గంగూలీ ఢిల్లీలో ఇటీవల బిజెపి నాయకుడు వరణ్ గాంధీని కలిసినప్పటి నుంచి ఆ ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇద్దరికీ తెలిసిన మిత్రుడి ద్వారా గంగూలీ వరుణ్ గాంధీని కలిశారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన వరుణ్ గాంధీ పశ్చిమ బెంగాల్ పరిశీలకుడిగా కూడా వ్యవహరిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ పాలిస్తున్న పశ్చిమ బెంగాల్లో 42 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. డార్జిలింగ్లో బిజెపికి తగిన బలం ఉంది.