దినకరన్ కు ఫస్ట్ వార్నింగ్: ఐటీ దాడులు సాంపిల్ మాత్రమే, సీఎం కావాలంటే !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఆశపడుతున్న టీటీవీ దినకరన్ కు ఝలక్ ఇవ్వడానికే శుక్రవారం ఆ రాష్ట్రంలో ఐటీ దాడులు జరిగాయని సమాచారం. దినకరన్ హద్దు మీరి ఎగిరిపడటంతోనే ఆయన్ను అదుపులో పెట్టడానికి ఐటీ దాడులు జరిగాయని తెలిసింది.
విశ్వసనీయ సమాచారం మేరకు దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి కావడం కేంద్రంలోని పెద్దలకు ఇష్టం లేదని తెలిసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి ఎడప్పాడి పళనిసామిని తప్పించి తమిళనాడు సీఎం కావాలని దినకరన్ ప్లాన్ వేశారని సమాచారం.
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో గెలిచిన తరువాత తనను సీఎం కాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరని దినకరన్ ధీమాగా ఉన్నారని తెలిసింది. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటికే దినకరన్ అనుచరులను పోలీసులు అరెస్టు చేసి భారీ మొత్తంలో నగదు సీజ్ చేశారు. అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున పోటీ చేస్తున్న దినకరన్ తన అనుచరులతో భారీ మొత్తంలో ఆర్ కే నగర్ ఓటర్లకు నగదు పంచిపెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
ఈ సందర్బంలో దినకరన్ కు ఝలక్ ఇవ్వడానికే ఆయనకు అత్యంత సన్నిహితుడైన తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్, ఆయన అనుచరుల మీద ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారని సమాచారం.