ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సతీమణికి కరోనా పాజిటివ్...
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సతీమణి సావిత్రికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్గా నిర్దారణ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.
శుక్రవారం(అగస్టు 14) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు ఎంజీఎం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో లైఫ్ సపోర్ట్పై చికిత్స అందిస్తున్నామని శనివారం(అగస్టు 15) ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
'ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ICU)లో లైఫ్ సపోర్ట్పై చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.' అని ఎంజీఎం అసిస్టెంట్ డైరెక్టర్ డా.అనురాధ భాస్కరన్ తెలిపారు. ఎస్పీబీ త్వరగా కోలుకుని తిరిగి రావాలని సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నటీనటులు ట్వీట్స్ చేసిన సంగతి తెలిసిందే. దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా త్వరగా కోలుకుని రా మిత్రమా అంటూ భావోద్వేగంగా స్పందించారు.
'బాలు మీరు త్వరగా వచ్చేయండి. మీకోసం ఎదురుచూస్తున్నాను. మన జీవితాలు సినిమాతో మొదలుకాలేదు,సినిమాతో ముగిసిపోవు. కచేరీలతో మొదలైన మన ప్రయాణానికి సంగీతమే జీవితమైంది. అదే జీవనోపాధి అయింది. గాత్రం,సంగీతం లాగే... మన స్నేహ బంధం కూడా ఒక్కటే.' అంటూ ఇళయరాజా వ్యాఖ్యానించారు. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో గొడవలున్నా...మనం ఎప్పటికీ స్నేహితులమేనని...ఆ విషయం మన ఇద్దరికీ తెలుసునని ఇళయరాజా పేర్కొన్నారు. బాలు తప్పనిసరిగా తిరిగొస్తాడని తన అంతరాత్మ చెబుతోందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన వీడియో సందేశాన్ని షేర్ చేశారు.