పండ్లు తీసుకుని డబ్బులడిగితే పీక కోశాడు
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోపుడు బండిపై పండ్లు అమ్ముకునే ఓ వ్యక్తి వద్ద స్థానిక ఎస్పీ నేత ఒకరు అనుచరులతో వెళ్లి జామకాయలు తీసుకున్నారు. వాటికి డబ్బులివ్వమన్నందుకు ఆగ్రహంతో కత్తి తీసుకుని అతని గొంతు కోశారు. ఆ పండ్ల వ్యాపారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మీరట్కు 20 కిలోమీటర్ల దూరంలో గల సర్దానా ప్రాంతానికి చెందిన సద్దామ్(16) అనే యువకుడు పండ్లు అమ్ముతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన సమాజ్వాదీ పార్టీ నేత అనీస్ ఖురేషీ తన అనుచరులతో కలిసి అతని వద్ద జామకాయలు కొనడానికి వచ్చాడు. కిలో జామకాయలు కొనుక్కుని డబ్బులివ్వకుండా వెళ్లిపోతుండగా ఆ వ్యాపారి డబ్బులడిగాడు.
దాంతో ఆగ్రహించిన ఖురేషీతో పాటు ఉన్న వ్యక్తులు సద్దామ్ని చితకబాది గొంతు కోసి పరారయ్యారు. సద్దామ్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. సద్దామ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడైన సలీమ్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అయితే నిందితుల్లో ఒకరైన అనీస్ ఎస్పీ నేత కావడంతో కేసు వెనక్కి తీసుకోవాలంటూ తమని బెదిరిస్తున్నారని బాధితుడి కుటుంబసభ్యులు వాపోయారు.