ఐఏఎస్ ఫైజల్ సంచలన కామెంట్స్ : 'టీఆర్పీ కోసమే కశ్మీర్ పై విద్వేషం..'
కశ్మీర్ : సివిల్స్ లో కశ్మీర్ తరుపున తొలి ఐఏఎస్ టాపర్ గా నిలిచి, ప్రస్తుతం కశ్మీర్ లో పాఠశాల విద్య డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న ఐఏఎస్ షా ఫైజల్.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాపై తీవ్ర ఆగ్రహాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు.
కశ్మీర్ కల్లోలంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ఐఏఎస్ షా ఫైజల్ చేసిన తాజా కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. కశ్మీర్ లో చెలరేగిన హింసపై ఫేస్ బుక్ ద్వారా స్పందించిన ఫైజల్.. 'దేశం తన పౌరులను తానే చంపుకోవడానికి సిద్దపడడం.. గాయపర్చడం.. తనను తాను స్వీయ విధ్వంసం చేసుకోవడమేనని' కశ్మీర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకపోతే బుర్హానీ వనీ ఎన్ కౌంటర్ తర్వాత.. కొన్ని న్యూస్ ఛానెల్స్ చర్చల్లో భాగంగా బుర్హానీ పక్కనే తన ఫోటో కూడా పెట్టి కథనాలు ప్రసారం చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఫైజల్. మీడియా తన వ్యవహార శైలి మార్చుకోకపోతే త్వరలోనే ఐఏఎస్ పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
ఉద్దేశపూర్వకంగా ఓ వర్గం జాతీయ మీడియా.. తన ఫోటోలను బుర్హానీ ఫోటోలతో కలిపి ప్రసారం చేస్తోందని, ఇలాంటి కల్పిత కథనాల ద్వారా ప్రజల్లో మరింత విద్వేషాలు చోటు చేసుకునే ప్రమాదముందన్నారు ఫైజల్. కశ్మీర్ లో చెలరేగిన హింస పలువురి మరణానికి కారణమవడంతో కశ్మీర్ తీవ్ర సంతాపంలో మునిగిపోయి ఉందని.. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సింది పోయి న్యూస్ ఛానెల్సే రెచ్చగొట్టే విదంగా వ్యవహరించడం కశ్మీరీలను ఏకాకులను చేసే చర్యగా అభివర్ణించారు.
ప్రభుత్వ తీరు కన్నా జాతీయ మీడియా తీరే దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫైజల్. కేవలం టీఆర్పీ రేటింగ్ కోసమే ఆరాటపడుతున్న న్యూస్ ఛానెల్స్, కశ్మీర్ లోయలో చిచ్చు రేపే విధంగా వ్యవహరిస్తున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని కశ్మీరీలకు పిలుపునిచ్చారు. టీవీ చానెల్స్ తనపై వండి వారుస్తోన్న కథనాలు చికాకు తెప్పిస్తున్నాయని, పరోక్షంగా సదరు టీవీ చర్చల్లో భాగమవడం ఆవేదనకు గురిచేస్తోందన్నారు.