సివిల్స్ లో ర్యాంకు సాధించిన జాతీయ ఉపాధి హామీ కూలీ కుమార్తె
తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్ జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిల్చోవడంతో దేశవ్యాప్తంగా ఈ గిరిజన జిల్లా పేరు మారుమోగిపోయింది. తాజాగా- మరోసారి అందరి దృష్టినీ తనవైపు మళ్లించుకుందా ప్రాంతం. దీనికి కారణం- ఓ గిరిజన యువతి. ఆమె పేరు శ్రీధన్య సురేష్. వాయనాడ్ జిల్లాకు చెందిన 22 సంవత్సరాల శ్రీధన్య సురేష్.. సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు తెచ్చుకున్న తొలి గిరిజన యువతిగా రికార్డు సృష్టించారు. కేరళ నుంచి ఓ గిరిజన యువతి సివిల్స్ లో ర్యాంకు సాధించడం..ఆ రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి.
మద్యం సీసాలపై తెలుగుదేశం ఎన్నికల గుర్తు..స్లోగన్! రాజధాని ప్రాంతంలో భారీగా పట్టివేత
410 వ ర్యాంకు..
గిరిజనులు పెద్ద సంఖ్యలో నివసించే జిల్లా వాయనాడ్. కురిచియా తెగకు చెందిన గిరిజనులు పెద్ద సంఖ్యలో ఆ జిల్లాలో నివసిస్తున్నారు. నిరక్షరాస్యత అధికంగా ఉండే తెగ అది. ఆ తెగకు చెందిన చాలామంది పిల్లలు పాఠశాల ముఖం చూసి ఉండరు. అలాంటి తెగ నుంచి వచ్చిన శ్రీధన్య తన మూడో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో ర్యాంకు సాధించారు. 410వ ర్యాంకు తెచ్చుకున్నారు. వాయనాడ్ జిల్లాలోని పోళ్తానా ప్రాంతానికి చెందిన శ్రీధన్య ఇదివరకు పోలీసు శాఖలో ఉద్యోగాన్ని సాధించారు. కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యారు. దీనితో పాటు గిరిజన శాఖలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా కూడా ఆమె ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు. అవేవీ ఆమెకు సంతృప్తిని ఇవ్వలేకపోయాయి. దీనితో సివిల్స్ పై దృష్టి పెట్టారు.
తండ్రి.. ఉపాధి హామీ పథకం కూలీ
శ్రీధన్య తండ్రి సురేశ్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నారు. భార్య కమల, కుమారుడు, కుమార్తె శ్రీధన్యతో కలిసి వాయనాడ్ జిల్లాలోని పోళుతానా ప్రాంతంలోని అచ్చూరనం గ్రామంలో నివసిస్తున్నారు. రోజువారీ కూలీగా జీవితాన్ని గడుపుతున్న కూలీ కుమార్తోె జాతీయ స్థాయిలో సివిల్స్ లో ర్యాంకు సాధించడం చాలామందికి స్ఫూర్తినిచ్చే అంశం.
కాలికట్ వర్శిటీ విద్యార్థిని..
ఆమె కాలికట్ విశ్వవిద్యాలయంలో అప్లయిడ్ జువాలజీలో పీజీని పూర్తి చేశారు. అక్కడ చదువుకుంటుండగానే, కేరళ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. కానిస్టేబుల్ పోస్ట్ ను సాధించారు. కొద్దిరోజుల పాటు గిరిజన సంక్షేమ శాఖలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా ఉద్యోగం వచ్చినప్పటికీ..దాన్ని కూడా వదులుకున్నారు. సివిల్స్ పై దృష్టి పెట్టారు. తనకు అందుబాటులో ఉన్న అతి పరిమిత వనరులతోనే చదివారు. జాతీయ స్థాయిలో 410వ ర్యాంకును సాధించారు.
ఐఎఎస్ కావాలన్నదే లక్ష్యం..
తాను అత్యంత వెనకబడిన జిల్లా నుంచి వచ్చానని, ఐఎఎస్ కావాలన్నదే లక్ష్యమని అన్నారు. సివిల్స్ లో ర్యాంకు సాధించడానికి గతంలో రెండు సార్లు ప్రయత్నించి విఫలం అయ్యానని అన్నారు. అయినప్పటికీ.. నిరాశ చెందకుండా మూడోె ప్రయత్నంలో ర్యాంకు తెచ్చుకున్నానని శ్రీధన్య సురేష్ తెలిపారు. తమ సామాజిక వర్గానికి చెందిన గిరిజన జనాభాలో నిరక్షరాస్యత చాలా తక్కువగా ఉందని, వారిని విద్యావంతులను చేయడం తన లక్ష్యమని చెప్పారు.
శుభాకాంక్షలు చెప్పిన రాహుల్ గాంధీ, పినరయి
శ్రీధన్య సురేష్ ర్యాంకు సాధించిన విషయం తెలుసుకున్న వెంటనే రాహుల్ గాంధీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడేతత్వం, అంకితభావం ఆమెకు సివిల్స్ ర్యాంకు తెచ్చిపెట్టాయని అన్నారు. తన అభిరుచుల మేరకు ఎంచుకున్న రంగంలో విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె విజయం.. చాలామందికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శ్రీధన్యతో ఫోనులో మాట్లాడారు. శుభాకాంక్షలు తెలిపారు.