నిజ జీవిత గాథ: అన్నం కోసం ఓ శరణార్ధి ఆత్మహత్య
చెన్నై: తమిళనాడులోని మధురైలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ శ్రీలంక శరణార్థి విద్యుత్ హైటెన్షన్ టవర్ ఎక్కి విద్యుత్ వైర్లను తాకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. రవీంద్రన్ (48) అనే వ్యక్తి ఓ శరణార్థి. శ్రీలంక నుంచి వచ్చి మధురైలో శరణార్థుల నివాసంలో ఉంటున్నాడు.
అతడి కుమారుడికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్సను అందిస్తున్నాడు. ఇదే సమయంలో శరణార్థులకు ఆహారం ఏర్పాట్లు చూసేందుకు ఓ రెవెన్యూ అధికారి వచ్చాడు. తన కుమారుడి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేర్పించామని, అతడికి గైర్హాజరు వేయొద్దని కోరాడు.
మీరు గైర్హాజరు వేస్తే, తన కుమారుడికి భోజనం దొరకదని ఆ అధికారి వద్ద మొరపెట్టుకున్నాడు. అంతేకాదు తన కుమారుడు ఆసుపత్రిలో ఉన్నాడనే విషయాన్ని రుజువు చేసేందుకు రశీదుని కూడా చూపించాడు. అయితే రవీందర్ కోరికను మన్నించని ఆ ఆధికారి గైర్హాజరైనట్లుగా మార్క్ చేశాడు.
ఈ క్రమంలో రవీందర్ మరోసారి బ్రతిమలాడగా కనికరించిన ఆ అధికారి కరెంటు స్తంభం ఎక్కి దూకి చావు అన్నాడట. ఆ మాట అనగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రవీందర్ సమీపంలో ఉన్న హై టెన్షన్ విద్యుత్ వైర్ల స్థంభాన్ని ఎక్కి ఆ వైర్లు పట్టుకొని సెకన్లలో చనిపోయాడు.
ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడికి పెద్దఎత్తున స్థానికులు చేరుకున్నారు. అయితే స్థానిక అధికారి వేధింపుల వల్లే రవీందర్ చనిపోయాడంటూ మిగతా శరణార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాదు ఆ అధికారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఆ అధికారికి రక్షణ కల్పించారు.
అనంతరం దాడిలో తీవ్రంగా గాయపడ్డ అధికారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై మధురై ఎస్పీ విచారణ చేపట్టారు.