‘కర్ణాటక ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అతనే’
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకొనే దిశగా బీజేపీ అడుగులేస్తున్నది. బీజేపీ అత్యధిక స్థానాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన వారిలో గిరిజన నేత బీ శ్రీరాములు ఒకరు. ఆయనకు లింగాయత్ వర్గం అండ ఉంది. ఓ పక్క ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతుండగానే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే విధంగా శ్రీరాములుకు మద్దతు పెరుగుతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చేలా చేయడానికి శ్రీరాములు, యాడ్యురప్ప విశేష కృషి చ చేశారనే వాదన వినిపిస్తున్నది. తాజా ఎన్నికల్లో శ్రీరాములు చిత్ర దుర్గ జిల్లాలోని మొల్కల్మూరు, భాగల్కోట్ జిల్లాలోని బాదామీ నుంచి బరిలోకి దిగారు. బాదామీలో సిద్దరామయ్య చేతిలో ఓటమి పాలుకాగా, మొల్కల్మూరులో విజయం సాధించారు.
2004లో కర్ణాటక అసెంబ్లీకి శ్రీరాములు తొలిసారి ఎన్నికయ్యారు. 2014లో ఎంపీగా ఎన్నికయ్యే వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2012లో బీజేపీకి గుడ్బై చెప్పి సొంతంగా బీఎస్ఆర్ అనే పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత మళ్లీ సొంతగూటికి చేరుకొన్నారు.
కర్ణాటకలో శ్రీరాములు ప్రధానమైన పాత్ర పోషించడానికి రంగం సిద్ధమైంది. అధిష్టానం ఆయనను డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉంది. త్వరలోనే బీజేపీ అధినాయకత్వం తుది నిర్ణయం తీసుకొంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో నేతలను తయారు చేయాల్సిన అవసరం ఉంది అని కర్ణాటక బీజేపీ నేత ఒకరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శ్రీరాములు కీలక నేతగా ఎదగడం ఖాయం. అతనికి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఆయనకు కీలక పదవిని కట్టబెట్టడం ఖాయం అని మరో నేత అన్నారు.