నిర్మలకు పదోన్నతి: దత్తాత్రేయకు కేబినెట్, సుజనకు...
న్యూఢిల్లీ/హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇరవై మందిని కొత్తగా తీసుకునే అవకాశం ఉంది. వీరిలో బీజేపీ నేతలు మనోహర్ పారికర్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, రాజీవ్ ప్రతాప్ రూఢీ, బండారు దత్తాత్రేయ తదితరులు ఉన్నారని తెలుస్తోంది. బీజేపీ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నుండి మరొకరికి చోటు కల్పిస్తున్నారు. సుజనా చౌదరిని కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఆయనకు సహాయ మంత్రి పదవి లభించవచ్చు. దత్తాత్రేయకు స్వతంత్ర లేదా కేబినెట్ హోదా దక్కనుంది.
మంత్రివర్గంలో తెలుగు వారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రాష్ట్రపతి భవన్లోని అశోకాహాలులో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతుంది. సుమారు 18 నుండి 20 మంది కొత్త వారికి పదవులు లభించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
బొగ్గు కుంభకోణాన్ని వెలికి తీయడంలో కీలక పాత్ర పోషించిన మహారాష్ట్ర ఎంపీ హన్స్ రాజ్ ఆహిర్ను ఇప్పుడు పదవి వరిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల రీత్యా ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వద్ద అదనంగా ఉన్న రక్షణ శాఖను గోవా మాజీ సీఎం మనోహర్ పరికర్కు ఇవ్వనున్నట్లు తెలిసింది.
వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార మంత్రి ప్రకాశ జవదేకర్లకు కేబినెట్ హోదా లభించ వచ్చు. వీరిద్దరు అదనంగా నిర్వహిస్తున్న శాఖలను కొత్త వారికి ఇస్తారు. మానవ వనరుల మంత్రి స్మృతి ఇరానీని మరో శాఖకు బదిలీ చేస్తారని, ఆ శాఖను రవిశంకర్ ప్రసాద్కు లేదా నిర్మలా సీతారామన్కు అప్పగిస్తారని తెలుస్తోంది. రవిశంకర్ ప్రసాద్, వెంకయ్య, గడ్కరీ తదితరులు ఒకటికిమించి శాఖలు నిర్వహిస్తున్న రీత్యా అందులో కొన్నింటిని కొత్తవారికి కేటాయించే అవకాశాలున్నాయి.
శాఖల కేటాయింపుల విషయంలో మోడీ శనివారం రాత్రి వరకూ కసరత్తు చేశారు. కాగా, కాబోయే కొత్త మంత్రులందరికీ ఆదివారం ఉదయమే మోడీ తేనీటి విందు ఇవ్వనున్నారు.
కాగా, కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు స్వీకరించేందుకు ఇప్పటికే గోవా సీఎం పదవికి రాజీనామా చేసిన మనోహర్ పారికర్తో పాటు సురేశ్ ప్రభు, అజయ్ దేశాయ్, హన్స్రాజ్ గంగారామ్ ఆహిర్ (మహారాష్ట్ర), ముక్తార్ అబ్బాస్ నక్వీ (ఉత్తరప్రదేశ్), గిరిరాజ్ సింగ్, రామ్కృపాల్ యాదవ్, రాజీవ్ ప్రతాప్ రూఢీ(బీహార్), జయంత్సిన్హా(జార్ఖండ్), వీరేంద్ర సింగ్ (హర్యానా), అనురాగ్ ఠాకూర్, జగత్ ప్రకాశ్ నడ్డా (హిమాచల్ ప్రదేశ్), కల్నల్ సోనారామ్ చౌదరి, గజేంద్ర సింగ్ షెఖావత్, రాజ్యవర్ధన్ రాథోడ్ (రాజస్థాన్), రమేశ్ బైంస్(ఛత్తీస్గఢ్), విజయ్సాంప్లా(పంజాబ్), సుజనా చౌదరి(ఆంధ్రప్రదేశ్), దత్తాత్రేయ(తెలంగాణ) పేర్లు వినిపిస్తున్నాయి.
శివసేన ఝలక్
శివసేన నుండి అనిల్ దేశాయ్కు మంత్రి పదవి దక్కనున్నట్లు వార్తలు వినిపించినా.. దాని పైన తుది నిర్ణయం జరగలేదని ఆ పార్టీ నేత, కేంద్రమంత్రి అనంత్ గీతే చెప్పారు. ప్రధాని మోడీతో మాట్లాడటానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు శివసేన నాయకత్వం నుండి పిలుపు రావడంతో గీతే శనివారం రాత్రి ఢిల్లీ నుండి ముంబై వచ్చారు. దీంతో కేంద్రమంత్రివర్గంలో శివసేన నుండి కొత్తగా ఎవరు చేరకపోగా.. కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారానికి ఆ పార్టీ ప్రతినిధులు
ఎవరు హాజరు కాకపోవచ్చునని తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపబీ, శివసేన మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలే ఈ పరిస్థితికి కారణమని చెబుతున్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యేలు ఆదివారం భేటీ అయి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వంలో చేరే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.