తమిళనాడు చరిత్రలోనే తొలిసారి ఇలా!..:సీఎస్ ఇంట్లో దాడులపై స్టాలిన్
ఓ సీఎస్ అధికారి ఇంట్లో ఐటీ దాడులు జరగడం తమిళనాడు చరిత్రలో ఇదే తొలిసారని డీఎంకే నేత స్టాలిన్ అభిప్రాయపడ్డారు.
చెన్నై: బుధవారం తెల్లవారుజామున 5గం.ల నుంచే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వందకోట్ల విలువ చేసే బంగారాన్ని నగదుగా మార్చుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రామ్మోహన్ రావు ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
గత కొద్దిరోజులుగా చెన్నైలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో టీటీడీ సభ్యుడు శేఖర్ రెడ్డి వద్ద భారీ మొత్తంలో కొత్త నోట్లు బయటపడ్డాయి. కాగా, శేఖర్ రెడ్డితో సీఎస్ రామ్మోహన్ రావుకు లింకులు ఉన్నాయన్న వాదన ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఐటీ దాడుల నేపథ్యంలో రామ్మోహన్ రావు ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉంటే, దీనిపై ప్రతిపక్ష డీఎంకే నేత స్టాలిన్ స్పందించారు. ఓ సీఎస్ అధికారి ఇంట్లో ఐటీ దాడులు జరగడం తమిళనాడు చరిత్రలో ఇదే తొలిసారని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఇంతవరకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్న సందర్బం తమిళనాడు చరిత్రలో లేదన్నారు. సీఎస్ నివాసంపై ఐటీ దాడులు.. తమిళనాడు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తాయని స్టాలిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు