క్రిమినల్స్ను పట్టిచ్చే స్మార్ట్ గ్లాసెస్.. మనకూ వచ్చేశాయ్!
న్యూఢిల్లీ: నేర పరిశోధన రంగంలో టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. నేరస్థులను పట్టుకునేందుకు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. నూతన పరికరాలను తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో కొత్త సాంకేతిక పరికరం పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో నేరస్థులను పట్టుకోవడం మరింత తేలిక కానుంది.
గుర్గావ్కు చెందిన స్టాక్యూ అనే స్టార్టప్ సంస్థ దేశంలోనే తొలిసారిగా సరికొత్త కళ్లద్దాలు(స్మార్ట్ గ్లాసెస్)ను ఆవిష్కరించింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి. వీటిని ధరించిన పోలీసులు జనంలో తిరిగే సమయంలో ఈ గ్లాసెస్ జనాల ముఖాలను స్కాన్ చేసి నేరస్తులను గుర్తిస్తాయి.
చైనాలో ఇప్పటికే ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రాగా త్వరలో మన దేశంలోనూ ఈ గ్లాసెస్ను పోలీసులు, ఇతర నేర విచారణ విభాగాలకు చెందిన అధికారులు వాడనున్నారు. ముందుగా ఈ గ్లాసెస్ను పంజాబ్లో పరిశీలించనున్నారు. అక్కడ విజయవంతమైతే ఆ తరువాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారు.
ఈ స్మార్ట్ గ్లాసెస్ జనం ముఖాలను స్కాన్ చేసి, ఫొటోలు తీసి వాటిని రిమోట్ సర్వర్కు పంపిస్తాయి. రిమోట్ సర్వర్లోని డేటాబేస్లో ఉండే నేరస్తుల ఫొటోలతో ఆ ఫొటోలు మ్యాచ్ అయితే వెంటనే ఆ సమాచారం కూడా అందుతుంది. పైగా ఇదంతా చాలా తక్కువ సమయంలోనే జరిగిపోతుంది.
ఈ క్రమంలో సదరు పోలీసు అప్రమత్తమై జనాల మధ్యలో ఉన్న సదరు అనుమానితున్ని లేదా నిందితుడిని/నేరస్తుడిని అదుపులోకి తీసుకుంటాడు. ఇలా ఈ స్మార్ట్గ్లాసెస్ నేరస్థులను సులభంగా పట్టించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.
పంజాబ్ ప్రభుత్వం స్టాక్యూ కంపెనీతో ఇప్పటికే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా త్వరలోనే ఆ రాష్ట్ర పోలీసులకు ఈ గ్లాసెస్ను ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ గ్లాసెస్ను వాడి నేరస్తులను సులభంగా పట్టుకోగలుగుతారు.
ఈ స్మార్ట్ గ్లాసెస్ను రిమోట్గా కూడా ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. ఈ గ్లాసెస్లో ఇమేజ్, స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ను ఏర్పాటు చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తూ జనాల మధ్యలో ఉండే క్రిమినల్స్ను రియల్టైమ్లో సులభంగా గుర్తిస్తూ వారిని వేగంగా పట్టిస్తుంది.