యువతిపై పినతండ్రి రేప్, ఆమె కూతురి హత్య: నిందితుడికి జీవిత ఖైదు
జస్టిస్ విజయ కప్సే తహిల్రామని, జస్టిస్ అనిల్ మీనన్ లతో కూడిన ధర్మాసనం అత్యాచారం, హత్య కేసులో దోషిగా తేల్చింది. ‘థోరట్ ఆ యువతిపై అత్యాచారం చేశాడనడానికి తగిని ఆధారాలున్నాయి. థోరట్ చేసిన అఘాయిత్యానికి ఫలితంగా ఆ యువతి గర్భవతి అయింది. ఓ పాపకు జన్మనిచ్చింది. ఆ పాపతో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన యువతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన థోరట్.. ఆ పాపను గొంతునులిమి హత్య చేశాడు' అని న్యాయమూర్తులు తెలిపారు.
‘నేరం రుజువు కావడంతో నిందితుడు థోరట్కు జీవిత ఖైదు తగిన శిక్ష' అని పేర్కొన్నారు. కింది కోర్టు జీవిత ఖైదు విధిస్తూ ఇచ్చిన తీర్పును సమర్థిస్తున్నట్లు తెలిపారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు చెప్పారు. మృతి చెందిన పాప డిఎన్ఏ.. నిందితుడు థోరట్ డిఎన్ఏ ఒక్కటేనని వైద్య పరీక్షల్లో తేలిందని కోర్టు పేర్కొంది. ఇంతకంటే పెద్ద సాక్ష్యం అవసరం లేదని అభిప్రాయపడింది.
కాగా, బాధితురాలి తల్లి భర్త చనిపోవడంతో నిందితుడు థోరట్ ఆమెను వివాహం చేసుకున్నాడు. 2007 నవంబర్ నెలలో తల్లి పని మీద బయటికి వెళ్లడంతో బాధిత యువతి ఒక్కతే ఇంట్లో ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న థోరట్ ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రతీ శుక్రవారం తల్లి బయటికి వెళ్లగానే బెదిరింపులకు గురిచేసి యువతిపై థోరట్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇలా కొన్ని నెలలపాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గర్భవతి అయింది. ఈ విషయం బాధితురాలి తెలియడంతో ఆమె నిలదీసింది. అయితే యువతిని చంపేస్తానని బెదిరింపులకు గురిచేయడంతో ఆమె బయటికి చెప్పలేదు. 2009 జనవరిలో బాధిత యువతి ఓ పాపకి జన్మనిచ్చింది. ఆ పాపతో ఇంటికి వచ్చిన యువతిని బెదిరింపులకు గురిచేసి, ఆ పాపని గొంతునులిమి చంపాడు థోరట్. దీంతో బాధిత యువతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరున్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.