ఇలాంటి న్యూస్ రాస్తే చెప్పులతో కొడతారు: కిరణ్ రిజిజు ఫైర్
తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు అరుణాచల్ప్రదేశ్ వస్తే వారిని స్థానికులు చెప్పుతో కొడతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు.
న్యూఢిల్లీ: తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వారు అరుణాచల్ప్రదేశ్ వస్తే వారిని స్థానికులు చెప్పుతో కొడతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా మండిపడ్డారు. సొంత ప్రజలకు సాయం చేయడం అవినీతి అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు.
మంత్రి కిరణ్ రిజిజు బంధువు, కాంట్రాక్టరైన గోబోయ్ రిజిజు, నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్(ఎన్ఈఈపీజీఓ)కి చెందిన మరికొంత మంది అధికారులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అరుణాచల్ప్రదేశ్లో రెండు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు కట్టేందుకు వీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు.
ఈ కాంట్రాక్ట్లో అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి రిజిజు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డ్యామ్లు నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని విద్యుత్శాఖ మంత్రికి రిజిజు లేఖ రాశారు. కానీ, అందులో తానేమీ తప్పుగా రాయలేదని మంత్రి తెలిపారు.
'ఇది సిగ్గు చేటు, ఎవరు ఈ కథనాలను సృష్టించారు? ఎవరైతే ఈ కథనాలను సృష్టిస్తున్నారో వారు మా ముందుకొస్తే చెప్పు దెబ్బలు తింటారు. ప్రజలకు సేవ చేయడమే అవినీతా?' అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Now Congress must apologise to the Nation. All Contract works & payments were made during Congress regime. I just forwarded a memorandum. https://t.co/2gOFKQIaju
— Kiren Rijiju (@KirenRijiju) 13 December 2016
కాగా, ఎన్ఈఈపీసీఓ చైర్మన్, రిజిజు బంధువు పేర్లతో పాటు మరికొందరి పేర్లతో 129 పేజీల నివేదికను పీఎస్యూ(పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్) చీఫ్ విజిలెన్స్ అధికారి ప్రభుత్వానికి సమర్పించారు. ఇది ఇలా ఉండగా, రూ. 450కోట్ల మేర అవినీతి జరిగిందంటూ కిరణ్ రిజిజుపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తమ వద్ద ఆడియో ప్రూఫ్ కూడా ఉందని తెలిపింది.