ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణ తప్పదు, లేదంటే మూత: కేంద్రమంత్రి ఠాకూర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయగా.. తాజాగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ అంశంపై స్పందించారు. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర వైఖరిపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ సస్మిత్ పాత్ర అడిగిన ప్రశ్నకు అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.
దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసివేస్తామని స్పస్టం చేశారు. ప్రైవేటీకరణ విభిన్న అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఐదేళ్లలో 5 ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీీసఈఏ) అనుమతి ఇచ్చిందని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటజిక్ పరిధిలోకి వస్తుందని, ఈ విభాగంలోకి వచ్చే ప్రభుత్వ రంగ వాణిజ్య పరిశ్రమలను సాధ్యమైనంత వరకు ప్రైవేటీకరిస్తామన్నారు. లేదంటే వాటిని మూసివేసే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం 2021 ఫిబ్రవరి 4న ప్రభుత్వ రంగ సంస్థల విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు.
ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు ఇది వర్తిస్తుందని కేంద్రమంత్రి ఠాకూర్ తెలిపారు. ఈ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ అనేది ఆ రంగంలో ట్రెండ్స్, పరిపాలనా సాధ్యాసాధ్యాలు, పెట్టుబడిదారుల ఆసక్తిపై ఆధారపడి ఉంటుందని వివరించారు. కాగా, ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవైటీకరణపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసిన విషం తెలిసిందే. ఏపీతో సంబంధం లేదని, 100 కేంద్ర ప్రభుత్వ వాటాతోనే స్టీల్ ప్లాంట్ నడుస్తోందని, ప్రైవేటీకరణ కేంద్రానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు.