టెక్కీలపై ఆ సర్వే పరమ చెత్త: ఇన్ఫోసిస్ మాజీ టాప్ బాస్
భారత టెక్కీల సామర్థ్యంపై యాస్పైరింగ్ మైండ్స్ చేసిన సర్వేపై మోహన్దాస్ పాయ్ ఎండగట్టారు. ఆ సర్వేను పరమ చెత్త సర్వేగా అభివర్ణించారు.
న్యూఢిల్లీ: ఉపాధి అంచనాల సంస్థ యాస్పైరింగ్ మైండ్స్ నిర్వహించిన సర్వేపై భారత ఇన్ఫోసిస్ మాజీ టాప్ బాస్ మోహన్ దాస్ పాయ్ నిప్పులు చెరిగారు. ఆ సర్వేను పరమ చెత్తదంటూ భారత టెక్కీలను ఆయన వెనకేసుకొచ్చారు. దేశంలోని 95 శాతం మంది భారత ఇంజినీర్లు సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు పనికిరారంటూ ఆ సంస్థ సర్వే తేల్చిన విషయం తెలిసిందే.
భారత ఇంజనీర్ల సామర్ధ్యాన్ని తక్కువ చేస్తూ చూపిన ఆ అధ్యయనాన్ని 'స్టుపిడ్ సర్వే'గా అభివర్ణిస్తూ ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. తమ అధ్యయనం ప్రకారం కేవలం 4.77 శాతం మంది మాత్రమే తప్పుల్లేకుండా సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ రాయగలరని యాస్పైరింగ్ మైండ్స్ చెప్పిన విషయం తెలిసిందే.
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్గా పనిచేసిన మోహన్దాస్ పాయ్ ప్రస్తుతం మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. టెక్నాలజీలో చోటుచేసుకున్న విశేషమైన మార్పులు, అమెరికా సహా పలు దేశాలు వీసా నిబంధనలు కఠినతరం చేయడం కారణంగా ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం
ఐటీ రంగంలో సగటు భారత ఉద్యోగి వయసు కేవలం 27 సంవత్సరాలేననీ, కాబట్టి వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి చూడడం తగదని ఆయన అన్నారు. కాగా బయోకాన్ అధినేత కిరణ్ మజుందార్ షా పాయ్ వ్యాఖ్యలను బలపరిచారు. మోహన్దాస్ పాయ్ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని, వారికి ఈ సమాచారం ఎలా వచ్చిందో తనకు అర్థం కావడంలేదని, వాస్తవానికి భవిష్యత్ మొత్తం బ్లూకాలర్ ఉద్యోగులదేనని ఆయన ట్విటర్లో వ్యాఖ్యానించారు.