రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వండి: జ్ఞానవాపి సర్వే టీంకు వారణాసి కోర్టు ఆదేశం, కమిషనర్ తొలగింపు
వారణాసి: జ్ఞాన్వాపి మసీదు సముదాయ ప్రాంగణాన్ని సర్వే చేసేందుకు వారణాసి కోర్టు నియమించిన బృందానికి తన నివేదికను కోర్టు ముందు సమర్పించేందుకు రెండు రోజుల గడువు ఇచ్చింది. ఈ కేసును విచారిస్తున్న వారణాసిలోని సివిల్ కోర్టు తాను నియమించిన ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రాను తొలగించింది. మిశ్రా సహాయకుడు సర్వేకు సంబంధించిన సమాచారాన్ని మీడియాకు లీక్ చేసినట్లు సమాచారం.
మిగిలిన ఇద్దరు - విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ - వరుసగా కోర్టు కమిషనర్, డిప్యూటీ కోర్టు కమిషనర్గా కొనసాగుతారు. కాగా, కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు సుదీర్ఘ న్యాయ పోరాటంలో చిక్కుకుంది. ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మిస్తున్నారనే వాదనలు రావడంతో వారణాసిలోని న్యాయస్థానం మసీదు నిర్మాణంపై విచారణ జరపాలని భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ)ని ఆదేశించింది.
మసీదులో శివలింగం: కోర్టు కీలక ఆదేశాలు
జ్ఞాన్వాపి మసీదు సముదాయం వద్ద చివరి రోజు సర్వే సందర్భంగా 'శివలింగం' కనిపించిందని, ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని వారణాసి కోర్టు సోమవారం జిల్లా మేజిస్ట్రేట్ను ఆదేశించింది. ఆ ప్రాంతానికి ఎవరినీ ప్రవేశించేందుకు అనుమతివ్వద్దని స్పష్టం చేసింది.
"సీల్డ్ ఏరియా భద్రతకు డీఎం, పోలీస్ కమీషనర్, పోలీస్ కమిషనరేట్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ వారణాసి బాధ్యత వహిస్తారు" అని ఆదేశించింది. ఈ కేసులో హిందూ పిటిషనర్ అయిన సోహన్ లాల్ ఆర్య, సర్వే కమిటీ కాంప్లెక్స్ వద్ద శివలింగాన్ని కనుగొన్నట్లు పేర్కొన్నారు
మసీదు సర్వే కోసం కోర్టు కమీషన్తో పాటు వచ్చిన ఆర్య, తమకు "నిశ్చయాత్మకమైన ఆధారాలు" దొరికాయని చెప్పారు లాల్ ఆర్య. "శివలింగం కనిపించిందని... ఎవరి కోసమైతే నంది ఇప్పటి వరకు ఎదురుచూస్తున్నాడో ఆయన దర్శనమిచ్చాడని తెలిపారు. విషయాలు స్పష్టంగా తెలియగానే మసీదు ప్రాంగణంలో 'హర్ హర్ మహావ్ దేవ్' కీర్తనలు ప్రతిధ్వనించాయి," అని ఆయన వెల్లడించారు.
శివుడి లింగం గుర్తించిన ప్రాంతానికి ఎవరినీ వెళ్లనీయకుండా చూసుకోవాలని వారణాసి కోర్టు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని స్పష్టం చేసింది. డీఎం, పోలీస్ కమిషనర్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) కమాండెంట్ వారణాసి.. సీల్ చేసిన ప్రాంత భద్రతకు బాధ్యత వహించాలన్నారు.